AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కొత్త జిల్లాలతో ఏపీలో కొత్త శకానికి నాంది అని అన్నారు. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రాగా ఆంధ్రప్రదేశ్ మారిందని వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లోని ఉద్యోగులందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. చివరగా 1970 మార్చిలో ప్రకాశం (Prakasam), 1979లో జూన్‌లో విజయనగరం (Vizianagaram) జిల్లా ఏర్పడిందని జగన్ (Jagan) గుర్తు చేశారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ (CM Jagan) కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా వర్చువల్‌గా ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ జిల్లాల పేర్లను జగన్ (CM Jagan) స్వయంగా చదివి వినిపించారు. ప్రజల సెంటిమెంట్లు, ఆయా జిల్లాల్లో పేరుగాంచిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నాకే ఇలా జిల్లాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు (AP New Districts List) ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని జగన్ చెప్పారు.


ఏపీలో (AP News) సుమారు 4.96 కోట్ల మంది ఉందని, ఇంత జనాభా ఉన్న ఏపీకి కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని చెప్పారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని అన్నారు. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో సరాసరిన 19.7 లక్షల మందికి ఒక జిల్లా అయిందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో కాకుండా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని అన్నారు.





జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 13 జిల్లాలు కాస్త 26గా మార్పు చెందాయి. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ భవనాల్లోనే అత్యధిక శాతం కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సరిపడా అధికారులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది.