AP CM Chandrababu Naidu A Key Decision On Capital Amaravati: రాజధాని అమరావతి ఆర్‌5 జోన్‌ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిపై వివాదం నెలకొంది. ఈ జోన్‌ విషయంలో పలువురు అమరావతి రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. అటువంటి వివాదాస్పద ఆర్‌5 జోన్‌కు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సమస్యకు పరిష్కారాన్ని చూపించినట్టు అయింది. ఆర్‌5 జోన్‌లో గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. వందలాది మంది ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేసింది. దీనిపై అప్పట్లోనే రాజధాని రైతులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించేలా సీఎం చంద్రబాబు గుంటూరు, కృష్ణా జిల్లాలు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్‌5 జోన్‌ సమస్యకు పరిష్కారం లభించినట్టు అయింది. 


సొంత ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు


ఆర్‌-5 జోన్‌లో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఆయా ప్రాంతాల నుంచి రావడం లబ్ధిదారులకు కూడా ఇబ్బందిగా మారనుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల సదస్సులో హౌసింగ్‌పై సమీక్ష సందర్భంగా ఆర్‌5 జోన్‌ గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ జోన్‌లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఆయా ప్రాంతాల్లోనే స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటే టిడ్కో ఇళ్లను తక్షణమే కేటాయించాలని స్పష్టం చేశారు. దీనిపై వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతోపాటు వివాదాస్పద జోన్‌-5 సమస్యకు పరిష్కారం లభించినట్టు అయింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చూపించడంతో రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ సమస్యలకు చెక్‌ చెప్పినట్టు అయింది. 


ఆర్‌-5 జోన్‌ అంటే ఏమిటి..?


అమరావతిలోని ప్రాంతాలను 2019లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది జోన్లుగా విభజించింది. ఈ మేరకు తొమ్మిది జోన్లుగా పేర్కొంటూ జీవో కూడా ఇచ్చారు. వీటిలో ఆర్‌-5 జోన్‌ కీలకం. ఈ ప్రాంతంలో 900 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలని భావించారు. తద్వారా రాజధాని ప్రాంతానికి ఆదాయాన్ని వచ్చేలా చేయాలని భావించారు. అయితే, జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఈ జోన్‌పై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్‌-5 జోన్‌లో ఎవరైనా నివసించేందుకు అనుగుణంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.


అందుకు అనుగుణంగానే ఇక్కడ విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. సుమారు పది లక్షల మందికి సెంటున్నర చొప్పున స్థలాలను ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు. వీరిలో మూడు లక్షల మందికి పట్టాలు పంపిణీ కూడా అయిపోయింది. స్థలాల హద్దులు కూడా కేటాయించారు. దీనిపై రాజధాని రైతులు న్యాయ పోరాటాన్ని చేస్తున్నారు. ఈ జోన్‌లో ఇళ్లను కేటాయించేందుకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.