AP CM Chandrababu focus to retain number 1 in Ease of Doing Business | అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 కొత్త విమానాశ్రయాలు, 4 కొత్త పోర్టులు వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఉండాలని, 2014-19 సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 4 ఏళ్లు ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగులో ఉన్న రైల్వే క్రాసింగ్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. 


‘రోడ్ల నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ నుంచి ఎక్కువగా టైమ్ వృథా జరుగుతోంది. అడవులు తవ్వుకుపోయినప్పుడు స్తబ్దుగా ఉన్నారు. రోడ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములను ప్రచారం కోసం ఇళ్ల స్థలాల కేటాయించారు. ఏపీఐఐసీలోనూ అక్రమాలు జరిగాయి. పోర్టుల నిర్మాణంలో టీడీపీ హయాంలో పీపీపీ తీసుకొస్తే గత ప్రభుత్వం ఈపీపీ విధానం తీసుకొచ్చింది. పోర్టులు త్వరితగతిన పూర్తవ్వాలి. 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి. 4 కొత్త పోర్టులు వస్తున్నాయి. మరో 3 విమానాశ్రయాలు వస్తాయి. మొత్తం 10 ఎయిర్ పోర్టుల నిర్మాణం పూర్తవ్వాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉండాలని’ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు.


‘గత ప్రభుత్వ ప్రయోజనం లేని చర్యలతో ఏపీకి చెందిన వారు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయి పెట్టుబడులు పెట్టారు. ఏ ప్రాజెక్టైనా ఆసల్యం అయితే ఖర్చు అదనం అవుతుంది. గతంలో పీపీఏలు రద్దు చేశారు. పీపీఏ లు రద్దు చేసినందుకు ఆయా సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఏపీలో విద్యుత్ కోతలు ఉండకూడదు. టీడీపీనే విద్యుత్ సంస్కరణలు తెచ్చింది. కొరత విద్యుత్ ను అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం. కానీ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలతో మళ్లీ కోతలు వచ్చాయి. విద్యుత్ ఆదాకు కూడా ప్రాధాన్యం ఉండాలి. పవర్ కొరత ఉన్న చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేయాలి. పగటి పూటే రైతులకు విద్యుత్ అందించాలి. విద్యుత్ వాహనాలు వినియోగం పెరగాలి.


వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు నిధులు ఖర్చు చేయలేదని, రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదని అధికారులకు చంద్రబాబు సూచించారు. చేనేత వస్త్రాలను (హ్యాండ్లూమ్స్) ను ప్రమోట్ చేయాలని, ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇదివరకే టాటా సంస్థతో మంగళగిరి చేనేతలు ఒప్పందం కుదుర్చుకుని విక్రయాలు చేస్తున్నారని, దాన్ని మరింతగా ప్రమోట్ చేసి వారికి సహకారం అందించాలన్నారు.