AP New CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తారని, రెండు రోజుల కిందట ప్రచారం కాగా, తాజాగా జవహర్ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ పదవీ కాలం నవంబర్ 30తో ముగియనుండగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ భారీగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైన సీఎస్ నియామకంపై సీఎం ఫోకస్ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరొకరి పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్‌ అరమణే పేరు నూతన సీఎస్ లిస్ట్ లో వినిపిస్తుంది.  1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిధర్‌ అరమణే ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి పేరు వినిపించినా తాజాగా గిరిధర్ అరమణే రేసులోకి వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో  గిరిధర్‌ అరమణే శనివారం భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీపై చర్చ జరుగుతోంది. మంగళవారం నాడు ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం.


స్పెషల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి వైపు మొగ్గు.. 
ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ నవంబర్ 30న పదవీ విరమణ చేశారు. ఆయన ప్లేస్‌ ఎవర్ని తీసుకురావాలన్న డిస్కషన్‌ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. వచ్చేది ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందన్న టాక్ నడిచింది. ఈ పదవికి చాలా మంది ఐఏఎస్‌లు పోటీలో ఉన్నారు. ఎంత మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం సీఎంకి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అనుకున్నట్లుగానే, కేఎస్ జవహర్ రెడ్డికి నూతన సీఎస్‌గా బాధ్యతలు అప్పగించింది సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. డిసెంబర్‌ 1న సీఎస్ గా ఆయన ప్రమాణం చేయనున్నారు.   


జవహర్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం కాగా, ఆయన 2024 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపుతున్నారనే మాట వినిపిస్తోంది. సీఎస్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్‌ రెడ్డిపై ఎప్పటి నుంచే జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపించింది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పుడు సీఎంకు స్పెషల్‌ సెక్రెటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు. 


సీఎస్ గా పదవీ విరమణ అనంతరం సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ ఛైర్మన్ పోస్టులోనూ ఆయనను ఇంఛార్జీగా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప జగన్ ప్రభుత్వ హయాంలో పని చేసిన సీఎస్‌లందరూ రిటైర్‌మెంట్‌ తర్వాత ఏదో ఒక పదవిలో నియమితులయ్యారు. 


ఇప్పటి వరకు నలుగురు ఐఏఎస్‌లు సీఎస్‌లుగా పని చేశారు. మొదట ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత నీలంసహ్నీ, అదిత్యనాథ్‌ దాస్‌, ఇప్పుడు సమీర్ శర్మ. అందరు కూడా సీఎంకు అత్యంత సన్నిహింతగా మెలిగారు. ఎల్వీ సుబ్రహ్మణానికి డిమాష్‌ వస్తే మిగతావాళ్లకు మాత్రం రిటైర్‌ అయిన తర్వాత వేర్వేరు శాఖల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. నీలం సాహ్నిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గానూ, ఆదిత్య నాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు.