AP New CS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఏపీ నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ అభినందనలు తెలియజేశారు. సమీర్ శర్మ పదవీకాలం ముగియనుండగా జవహర్ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న జవహర్ రెడ్డి 2024 జూన్ వరకు ఆ హోదాలో కొనసాగే అవకాశం ఉంది.


ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ పదవీ కాలం నవంబర్ 30తో ముగియనుండగా ఏపీ ప్రభుత్వం జవహర్ రెడ్డిని ఆ స్థానంలో నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం కొత్త సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వైఎస్సార్ సీపీతో పాటు ఏపీ ప్రభుత్వంలోనూ భారీగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైన సీఎస్ నియామకంపై సీఎం ఫోకస్ చేశారు.


ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్లేస్‌ ఎవర్ని తీసుకురావాలన్న డిస్కషన్‌ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వచ్చేది ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందన్న టాక్ నడిచింది. ఈ పదవికి చాలా మంది ఐఏఎస్‌లు పోటీలో ఉన్నారు. ఎంత మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం సీఎంకి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపారు. అనుకున్నట్లుగానే, కేఎస్ జవహర్ రెడ్డికి నూతన సీఎస్‌గా బాధ్యతలు అప్పగించింది సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్. 


జవహర్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం కాగా, ఆయన 2024 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపుతున్నారనే మాట వినిపిస్తోంది. సీఎస్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్‌ రెడ్డిపై ఎప్పటి నుంచే జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపించింది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పటివరకూ సీఎంకు స్పెషల్‌ సెక్రెటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరొకరి పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్‌ అరమణే పేరు నూతన సీఎస్ లిస్ట్ లో వినిపిస్తుంది.  1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిధర్‌ అరమణే ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి పేరు వినిపించినా తాజాగా గిరిధర్ అరమణే రేసులోకి వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో  గిరిధర్‌ అరమణే శనివారం భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీపై చర్చ జరుగుతోంది. మంగళవారం నాడు ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం.