తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులపై చంద్రబాబు(Chandrababu Naidu) దాఖలు చేసిన పిటిషన్ల విషయంలో ఏపీ హైకోర్టు స్వల్ప ఊరట ఇచ్చింది. అంగళ్లు కేసులో రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాత్రం వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.


లంచ్ తర్వాత హైకోర్టులో కొనసాగనున్న వాదనలు
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ భోజన విరామం తర్వాత హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని ఏజీ శ్రీరామ్‌ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్‌ కోరారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని.. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని  ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు.


ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు, తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పుడు అని, వాటిని కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. 


రైట్‌ టు ఆడియెన్స్‌ పిటిషన్‌ డిస్మిస్‌


విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. బుధవారం సాయంత్రం ఫైబర్‌ నెట్‌ కేసులో వాదనలు విననున్నారు. అంగళ్లు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, వాదనలో జరిగిన పరిణామాలను ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు వివరించారు. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంటుపై వాదనలు వినిపించేందుకు తాము రెడీగా ఉన్నామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.