ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్‌ఏ)-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. నవంబరు 4 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వాటిని నవంబరు 15కు వాయిదా వేశారు.


నవంబరు 3 నుంచి 3, 6, 9వ తరగతులకు రాష్ట్ర స్థాయి సాధన సర్వే నిర్వహిస్తున్నందున పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సర్వే ప్రాక్టీస్‌ కోసం ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ పాఠశాలలకు పంపించింది.


ఉచితంగా జీఆర్‌ఈ, జీమ్యాట్‌ తదితర పరీక్షలు..
ఏపీలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. విదేశాల్లో విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకు జీఆర్‌ఈ, జీమ్యాట్ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన మెటీరియల్, శిక్షణను విద్యార్థులకు అందించాలని తెలిపారు. అదేవిధంగా అమెరికా పర్యటనకు వెళ్లిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం సూచించారు. 


ప్రభుత్వం తరఫున ఇటీవల అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను అక్టోబరు 9న కలిసింది. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని, ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై మీరు ఆలోచనలు చేయాలని సీఎం కోరారు. 


విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారతాయని, బతుకులు మారాలంటే విద్య ఒక్కటే సాధనంమని జగన్ అన్నారు. మీరు చూసిన కొలంబియా విశ్వవిద్యాలయం వంటి వాటిల్లో సీట్లు సాధిస్తే ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ స్థాయి కళాశాలల నుంచి బయటకు వస్తేనే పెద్దపెద్ద కంపెనీలకు సీఈఓలు కావాలన్న మీ కలలు నిజమవుతాయని సీఎం తెలిపారు. 


విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళికలో లేని 1,800 కోర్సులను సిలబస్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఎడెక్స్‌తో కలిసి జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.


ALSO READ::


విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...