ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న ఆయన, 175 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నామన్న ఆయన, మళ్లీ జగనే ఎందుకు కావాలో ప్రజలకు వివరిస్తామన్నారు. ఆధారాలు ఉన్నందునే టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఎవరిపైనా కక్షసాధింపులు అవసరం లేదన్న అంబటి, ఎన్నికల ముందు కక్ష సాధింపు ఎందుకుంటాయన్నారు. 


17ఏ సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. టెక్నికల్‌ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు తప్ప, నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు. చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాడుతున్నారని అంబటి అన్నారు. గతంలోనే అనేక సార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారని, సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు. పురందేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారని, తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును కాపాడేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉండి తప్పు చేసి జైలుకెళ్లారని. జైలుకెళ్లిన ఏ నాయకుడైనా బతికిబట్ట కట్టలేదని, తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. 


నారా లోకేశ్‌పైనా మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఇన్ని రోజులు లోకేశ్‌ ఢిల్లీ ఓపెన్‌ జైలులోనే ఉన్నారని అంబాటి రాంబాబు అన్నారు. భయమంటే ఏంటో జగన్‌కు చూపిస్తానని నారా లోకేశ్ వార్నింగ్‌లు ఇస్తున్నారని, లోకేశ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, జైల్లో చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ పచ్చగా కళకళలాడుతూ ఉండేదని, అలాంటి పార్టీ లోకేశ్ ఎంట్రీతో భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, లోకేశ్ అనాలోచిత నిర్ణయాల ఫలితం కారణంగానే చంద్రబాబు నాయుడు పాలిట శాపంగా మారిందన్నారు. 


సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు అర్థమై ఉంటుందన్నారు అంబటి రాంబాబు. వైఎస్ రాజశేఖర్ రెడ్డే తనను ఏం చేయలేదని, ఆయన కొడుకు వైఎస్ జగన్ ఏం చేస్తాడు, బచ్చా అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారని రాంబాబు గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. జగన్ దెబ్బకు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారని అన్నారు.


చంద్రబాబుకు మద్దతిచ్చి మునిగిపోయే పడవను లేపుతామని పవన్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జైలుకుపోవడంతో టీడీపీ బలహీనపడిందని పవన్‌, సానుభూతి పెరిగిందని టీడీపీ చెబుతున్నారని న్నారు. పవన్‌కు డబ్బు అవసరం లేదంటూనే, ఎందుకు టీడీపీకి మద్దతు పలుకుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రెండుచోట్లా ఓడిపోయిన పవన్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు అంబటి రాంబాబు. వైఎస్సార్‌సీపీ 175 సీట్లలో గెలవటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు.