Vangalapudi Anitha on Heavy Rains: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసామన్నారు.


ఇంతవరకు భారీ వర్షాల కారణంగా 9 మంది మరణించారన్నారు. పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్  మొత్తం 17 బృందాలు 7 జిల్లాల్లోని  22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికి అవసరమైన 5 బోట్లు, ఒక హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంచామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారన్నారు. 




వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత పంటనష్టంపై ఎన్యూమరేషన్ చేపడతామని ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లలో వరిపంట నీట మునిగిందని, 7218 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగిందని మంత్రి అన్నారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యుత్ మొదలగు ప్రభుత్వ శాఖలన్నిటి సమన్వయంతో పనిచేసి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవడం వలన ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగారని అన్నారు. 


రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించి ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నామన్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు చేరినందున తమిళనాడు ఎక్సప్రెస్ ను నిలుపుదల చేసిన కారణంగా ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు ఆర్టీసి బస్సుల ద్వారా తరలించేందు ప్రత్యామ్నయ ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులకు ఆహారం , త్రాగు నీరు ఏర్పాటు చేశామన్నారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నందున ప్రజలు వాటిని దాటే విషయంలో ప్రభుత్వ హెచ్చరికలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సమీక్షలో సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌  జి.జయలక్ష్మి, సీసీఎల్‌ఏ కమిషనర్‌ శ్రీకేష్ బాలజీ, విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు.