వరుసగా నాలుగో ఏడాది, మొదటి విడతగా జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. చిరు వ్యాపారుల ఉపాధికి ఈ పథకం ఊతమని ప్రభుత్వం భావిస్తోంది. నిరు పేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేలు చెల్లిస్తోంది ప్రభుత్వం. సకాలంలో చెల్లించినవారికి 10,000కు అదనంగా ఏటా రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకూ వడ్డీలేని రుణాన్ని సర్కారు అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేలు అందిస్తోంది. 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తోంది. రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. మొత్తం రూ.560.73 కోట్లను నేడు(మంగళవారం)క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. 


లక్షల మంది చిరు వ్యాపారులు..
ఈ పథకం ద్వారా అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకు 15,87,492 మంది లబ్ధిదారులు. వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి పలుమార్లు రుణం కోరి పొందినవారు 13,29,011 మంది. వీళ్లకు వడ్డీ లేని రుణాలు రూ. 2,955.79 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది. నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.11.03 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన 15.31 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు.


వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్.. 
చిరు వ్యాపారులు రోజు వారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా చేశామంటోంది ప్రభుత్వం. వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి.


 జగనన్న తోడు ఎవరికి..
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకాలకు అర్హులు. ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్‌ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్‌ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు కూడా అర్హులే..


సకాలంలో రుణం చెల్లిస్తే.. 
నిత్యం మూలధనం అందుబాటులో ఉండేలా రుణాల మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.11వేలకు, రూ.11వేల నుంచి రూ.12వేలకు, రూ.12వేల ఉంచి రూ.13వేలకు పెంచుతున్నారు. ఆ మేరకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలిప్పిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.