Pawan Kalyan: ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో 183 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మొదట భావించిన ప్రభుత్వం కొన్ని కారణాలతో మొదట వంద ఏర్పాటు చేయాలని మిగితిన 83 సెప్టెంబర్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

వంద అన్న క్యాంటీన్లు 

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందివ్వాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం వివిధ పట్టణాల్లో ప్రత్యేక భవనాలు నిర్మించారు. వైసీపీ హయాంలో వీటిని మూసివేసింది. అన్న క్యాంటీన్లను ఎత్తేసింది. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే అన్నక్యాంటీన్లు ఏర్పాటుకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 184 క్యాంటీన్యూ ఒకేసారి ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భవన నిర్మాణ పనుల్లో ఆలస్యం కారణంగా ప్రస్తుతానికి పనులు పూర్తైన వంద క్యాంటిన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. 

పేరు మారిన విద్యా కానుక
విద్యాశాఖలో అమలు అవుతున్న పథకాలకు కొత్త పేర్లు పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో అమలు అవుతున్న ఆరు పథకాల పేర్లు మార్చాలని  మారుస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక పథకం పేరు మార్చేశారు. ఇప్పుడు మిగతా పథకాల పేర్లు కూడా మార్చాలని అధికారులకు సూచనలు చేశారు.  

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు, పిఠాపురంలో రంగంలోకి దిగిన IAS కృష్ణతేజ

వైసీపీ హయాంలో జగనన్న పేరుతో అమలైన పథకాలన్నింటి పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశానికి సేవలు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్‌కలాం, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టనున్నట్లు లోకేష్‌ తెలిపారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.  

అభినందనీయం

ప్రభుత్వ పథకాలకు దేశానికి సేవలు అందించిన వారి పేర్లు పెట్టడంపై పవన్ స్పందించారు. సమాజసేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాల్ని అమలు చేయడం హర్షణీయమని, స్ఫూర్తిదాయమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ ప్రశంసించారు. వారి ఆశీస్సులు ఎన్డీయే ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని అభిప్రాయపడ్డారు. 

"ప్రభుత్వ పథకాలను భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో అమలు చేయడం హర్షణీయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి,  విద్యా శాఖ మంత్రి లోకేశ్‌కి అభినందనలు. 

Also Read: ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం- ఏపీకి కేంద్ర మంత్రి పెమ్మసాని సరికొత్త నిర్వచనం

గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి – విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామం. 

విద్యా కానుక ద్వారా పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు.  ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుంది. 

మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఎప్పుడైనా అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. ఆమె దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి. 

మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది. 

మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయి. 

డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు నూతనోత్తేజం నింపాయన్నారు నారా లోకేష్. పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఇలా స్ఫూర్తిగా నిలించిందుకు పవన్‌కు అన్న అంటు లోకేష్‌ ధన్యవాదాలు తెలిపారు. 

విద్యా పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, ఏపీజే అబ్దుల్‌కలాం వంటి స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడాన్ని స్వాగతించిన పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

శనివారం ఈ పథకాల పేర్లపై ట్వీట్ చేసిన లోకేష్" అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ముందుగా గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటుచేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నాం. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అబ్ధుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్పూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నాను. 

జగన్ పథకాలు కొనసాగిస్తున్నట్టు క్లారిటీ
ఈ పథకాలు చాలా ఏళ‌్ల నుంచి ఉన్నప్పటికీ జగన్‌ హయాంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయిన ప్రభుత్వం మారడంతో వాటిని ఆపేస్తారా కొనసాగిస్తారా అన్న సందేహం చాలా మందిలో ఉంది. పేర్లు మార్చడంతో ఆ పథకాలు కొనసాగిస్తారనే క్లారిటీ వచ్చింది. ఆపేస్తారన్న పుకార్లకు షటర్ పడింది. 

  పథకం పాత పేరు  కొత్త పేరు 
1 జగనన్న అమ్మ ఒడి  తల్లికి వందనం
2 జగనన్న విద్యాకానుక  సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
3 జగనన్న గోరు ముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం 
4 మన బడి నాడు- నేడు  మన బడి- మన భవిష్యత్‌
5 స్వేచ్ఛ బాలికా రక్ష
6 జగనన్న ఆణిముత్యాలు అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం