Ambati Rambabu :  కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్‌ లేఖ రాశారన్నారు. ‘‘రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోం. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటాం. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకునేది లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 


నీటి బొట్టును కూడా వదులుకునేది లేదన్న అంబటి రాంబాబు


బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్తగా విధి విధానాలు ఇస్తూ, గెజిట్ రిలీజ్ అయ్యింది కాబట్టి... దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని అన్నారు.  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది... తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికే తప్ప.. కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని దానికి అప్పగించడం సరికాదని అంబటి రాంబాబు అన్నారు.  సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని తెలిపారు. బచావత్ కమిషన్ 1976లో ఇచ్చిన రిపోర్టు ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిలాల పంపిణీ జరగాలని తాము కోరుతున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. బచావత్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు ఇచ్చిందనీ... రాష్ట్రం విడిపోయిన తర్వాత... 299 టీఎంసీలు తెలంగాణకీ, 512 టీఎంసీలు ఏపీకి.. ఇచ్చేలా కేంద్రం అధ్వర్యంలో అంగీకారం కుదిరిందని మంత్రి గుర్తు చేశారు. బచావతి కమిషన్ ఆధారంగా ఈ నిర్ణయం జరిగిందన్న ఆయన.. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కి విధి విధానాలు అప్పగించడమేంటని ప్రశ్నిస్తామన్నారు.ఏపీలో రైతులకు అన్యాయం జరగనివ్వబోమన్న మంత్రి.. రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ నీటిబొట్టునూ తీసుకుంటామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పోరాడట్లేదని విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదన్నారు. 


నోటిఫికేషన్ ఇచ్చేసిన కేంద్రం 


తెలంగాణ  ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యున్‌లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం మేరకు జారీచేసిన టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌)ను శుక్రవారం రాత్రి గెజిట్‌లో ప్రచురించారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్‌ 89 ప్రకారం కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదించిన ప్రాజెక్టులవారీగా కేటాయించాల్సి ఉన్నది. నీటిలభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టులవారీగా వినియోగించుకోవడానికి ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ను రూపొందించాల్సి ఉన్నది. ఆ మేరకు విచారణ చేపట్టాలని ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ -2కు కేంద్రం టీవోఆర్‌ జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద చేపట్టిన విచారణ యథాతథంగా కొనసాగుతుంది. దానితోపాటు ట్రిబ్యునల్‌-1 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో, ఇతర కేటాయింపులు ఏమైనా ఉంటే వాటిపై కూడా బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ -2 విచారణ కొనసాగిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మళ్లించడంతో కృష్ణాలో ఏర్పడిన 80 టీఎంసీల మిగులు జలాల్లో ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలను కేటాయించారు. ఆ జలాలను నాగార్జునసాగర్‌ ఎగువన మాత్రమే వాడుకోవాల్సి ఉన్నది. ఆ 45 టీఎంసీల జలాలపైనా ట్రిబ్యునల్‌ విచారణ జరిపి ఏపీ, తెలంగాణకు పంచాల్సి ఉన్నది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్‌ 5(1) ప్రకారం ట్రిబ్యునల్‌-2 విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.