Minister Karumuri Nageswararao :వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. వినియోగదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది. సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ తాను నివాసం ఉంటున్న ప్రాంతం నుండే ఫిర్యాదు నమోదు చేసుకోవడమే కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణకు హాజరయ్యే వెసులుబాటును కల్పించామన్నారు. స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడమే కాకుండా అక్కడ నుండే వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావచ్చన్నారు. గతంలో ఈ వెసులుబాటు లేదని, వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలో లేదా ఆ వస్తువు తయారీదారుని రిజిస్టర్డు కార్యాలయంలో మాత్రమే ఫిర్యాదు చేసుకొనే సౌకర్యం ఉండేదన్నారు. 


గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు 


ప్రస్తుతం వినియోగదారులు తమ ఫిర్యాదులను స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ, ఆన్ లైన్ ద్వారా లేదా వినియోగదారుల సహాయ సేవ కేంద్రం, హెల్స్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు (1967 & 18004250082) కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని మంత్రి కారుమూరి తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సవరించిన వినియోగదారుల రక్షణ చట్టంపై వినియోగదారుల్లో  పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార మాద్యమాల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆదే విధంగా డిసెంబర్ 24న వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సవరించిన చట్టం ద్వారా వినియోగదారులకు కల్పించిన హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోనున్నామన్నారు. 


బంగారు దుకాణాల్లో తనిఖీలు 


వినియోగదారుల  హక్కులను పరిరక్షించేందుకు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పది నెలల కాలంలో మొత్తం 1,748 కేసులు నమోదు అవ్వగా, పాత వాటితో కలుపుకుని ఇప్పటి వరకూ 2,139 కేసులను పరిష్కరించామన్నారు. ఇంకా 4,407 కేసులను పరిష్కరించవలసి ఉందని మంత్రి తెలిపారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారని, పెట్రోల్ బంకులల్లో  తనిఖీలు జరిపి 97 కేసులను, ఎరువుల దుఖాణాలకు సంబంధించి 350 కేసులను, విశాఖపట్నం, విజయవాడలోని  షాషింగ్ మాల్స్ కు సంబంధించి 175 కేసులను నమోదు చేశామన్నారు. త్వరలో బంగారు నగల దుఖాణాల్లో కూడా తనిఖీలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.  ధాన్యం  తూకాల్లో  రైతులకు ఎటు వంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకై కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ  దాదాపు 93 వే బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ 


ఆహార పదార్థాల కల్తీలను నివారించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకుందని మంత్రి కారుమూరి తెలిపారు. ఇందుకు 15 మొబైల్ ల్యాబ్స్ ను విశాఖపట్నంలో ఉన్న ల్యాబ్ ను ఆధునీకరించడంతో పాటు విజయవాడ, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదిక ల్యాబ్స్ ను దశల వారీగా  ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది  జనవరి, ఫిబ్రవరి నాటికి కనీసం ఆరు మొబైల్ ల్యాబ్స్ ను ఏర్పాటు  చేసేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వ మే పెద్దఎత్తున కొనుగోలు చేస్తుందని, ఇందులో  రైస్ మిల్లర్ల ప్రమేయం ఏమాత్రం లేదన్నారు.  ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముతున్నట్లు చాలా మంది అపోహపడుతున్నారని, అందులో ఏమాత్రం నిజంలేదన్నారు. రైతుల నుంచి  కొనుగోలు చేసిన ధాన్యాన్ని  రైస్ మిల్లర్లకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఆడించుకుంటుందన్నారు.  ఈ ఏడాది వర్షాల వల్ల ధాన్యం పెద్దగా తడవలేదని, ఒక వేళ అక్కడక్కడా కొంత ధాన్యం తడిసినప్పటికీ ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు సొమ్ము చెల్లించాల్సి ఉందని, అయినప్పటికీ ఇంకా ముందుగానే రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తామన్నారు.