ఐక్యరాజ్య సమితి 2023 ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి  సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తృణధాన్యాల సాగుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని, రాష్ట్రంలో ఈ ఏడాది లక్షా 27 వేల హెక్టార్లలో తృణధాన్యాలను సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. తృణధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రభుత్వపరంగా తగిన మద్దతు ధరను ఇచ్చి ప్రోత్సహించడంతోపాటు ఆయా ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదే విధంగా తృణధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా ప్రోత్సాహాకాలను అందించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తదితర పట్టణాలన్నిటిలో తృణధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా తృణధాన్యాల ఉత్పత్తుల విక్రయానికి మహిళా మార్టుల పేరిట అమ్మకాలను ప్రోత్సహించాలని సెర్ప్ సీఇఓను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


సచివాలయంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు


రాష్ట్ర సచివాలయంలో తృణధాన్యాల ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదిని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి  ఆదేశించారు. అదే విధంగా సచివాలయంలో జరిగే వివిధ సమావేశాల్లో తృణదాన్యాలతో తయారు చేసిన స్నాక్స్ ను అందించేందుకు ప్రోటోకాల్ విభాగానికి ఆదేశాలు జారీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాల్లో తృణధాన్యాలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్లను సర్కులర్ జారీ చేయనున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెల తృణధాన్యాలపై రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ,అనుబంధరంగాల అధికారులతో సమీక్షించనున్నట్టు సీఎస్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జేసీ, వ్యవసాయశాఖ జేడీ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశం నిర్వహించి పెద్దఎత్తున తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కృషి చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


విలువైన పోషకాలు 


జొన్నలు,సజ్జలు,రాగులు వంటి తృణధాన్యాల్లోని పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా 70-80శాతం శక్తిని అందిస్తాయని భారీ పరిమాణాల్లో వినియోగిస్తుంటే ఇవి ఇతర పోషకపదార్ధాలైన మాంసకృత్తులు,కాల్షియం, ఐరన్ మరియు  బి కాంప్లెక్స్ విటమిన్లను  కూడా అందజేస్తాయని సీఎస్ డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, బీపీ వంటి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నిత్యం మన ఆహారంలో రాగులు, జొన్నలు, సజ్జలు ఉండటం మంచిదని ఆయన పేర్కొన్నారు. శరీరానికి అవసరం అయిన ఖనిజాలను, పీచును బాగా కలిగి ఉంటాయని రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుందని మూత్ర రోగాలను అరికడతాయని దేహపుష్టిని కలిగిస్తాయని సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. 


వ్యవసాయశాఖ పవర్ పాయిట్ ప్రజంటేషన్ 


వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో తృణధాన్యాల సాగు ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. 2022-23లో లక్షా 27వేల హెకార్లు,2023-24లో లక్షా 47వేల హెక్టార్లలో తృణధాన్యాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు.