CM Jagan Review : కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు – నేడు కార్యక్రమాలపై కూడా జగన్ సమీక్షించారు.  మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని  ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. జగనన్నకు చెబుదాం పేరులో నా పేరును కలిపారంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థం అవుతుందని జగన్ అన్నారు. ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నామని దానికంటే మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. 


నాణ్యమైన సేవల కోసమే 


నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని  రూపొందించామని సీఎం చెప్పారు. హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే.. దాన్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని,  ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలన్నారు. గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుందన్నారు.


 హెల్ప్‌ లైన్‌ ద్వారా గ్రీవెన్స్‌ ...


 హెల్ప్‌లైన్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించిన నంబర్ ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయని వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలని సీఎం చెప్పారు.  గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం ముఖ్యమన్నారు. ఇండివిడ్యువల్, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్, రిజ్టసర్‌ అయిన గ్రీవెన్సెస్‌ ఫాలో చేయడం, ప్రభుత్వ సేవలు, పథకాలపై విచారణ, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన  లక్ష్యాలను సూచించారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారని, వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చన్నారు.  ముఖ్యమంత్రి,  ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుందని వివరించారు.


ప్రజలకు అప్ డేట్స్ ఇలా ....


 ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందుతాయని జగన్ చెప్పారు. అంతేకాక ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పించి ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభంలోగా వాలంటీర్లు ప్రతి గడపకూ 1902 గురించి వివరిస్తారన్నారు. సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఉంటారన్నారు. క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారన్నారు.  ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను  సందర్శించి పర్యవేక్షిస్తారన్నారు.  కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారని చెప్పారు. సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారని వివరించారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారని చెప్పారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారని, ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారన్నారు. పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారని చెప్పారు. చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారని, ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుందని వివరించారు.


ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల నిధులు


 ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే. ఇది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలన్నారు. అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తారని,  మీరు  సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా పని  చేసినట్లేనన్నారు. అప్పుడే ఈ కార్యక్రమం సమర్థవంతంగా సాగుతుందని చెప్పారు. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు.  ప్రజలకు నాణ్యంగా సేవలను అందించాలన్నదే దీని ఉద్దేశమని , ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం  మంజూరు చేస్తుందని అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నామన్నారు. - కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మానిటరింగ్ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెట్టాలన్నారు. దీనివల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్‌ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుందని చెప్పారు.  గ్రామ స్థాయిలో సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెట్టాలని సూచించారు.