CM Jagan Review : ఆదాయార్జన శాఖల పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. కోవిడ్‌ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని సీఎంకు వివరించారు. డిసెంబర్‌ 2022 వరకూ జీఎస్టీ గ్రాస్‌ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం ఉండగా, ఏపీలో వసూళ్లు 26.2 శాతం ఉందన్నారు. తెలంగాణ17.3 శాతం, తమిళనాడు 24.9 శాతం, గుజరాత్‌ 20.2 శాతం కన్నా మెరుగైన వసూళ్లు ఏపీలో ఉన్నట్టుగా అధికారులు సీఎంకు వెల్లడించారు.


జీఎస్టీలోనూ మనమే టాప్ 


జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28 కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు జగన్ కు నివేదిక అందించారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ ఆదాయాలను కలిపి చూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని అధికారులు తెలియజేశారు. దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాలతో పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని  అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయన్నారు. విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఈ సందర్భంగా జగన్ అధికారులకు సూచించారు. డేటా అనలిటిక్స్‌ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయని సీఎం దృష్టికి తెచ్చారు. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.


సాంకేతికతను ఉపయోగించి 


టాక్స్‌ అసెస్మెంట్‌ను ఆటోమేటిక్‌ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. డివిజన్‌ స్థాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామన్నారు.


రికార్డు స్థాయిలో ఖనిజ శాఖ ఆదాయం 


గనులు–ఖనిజ శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ  రూ. 3,649 కోట్ల ఆర్జన కాగా.. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్ల ఆర్జన ఉండగా నిర్దేశించుకున్న రూ.5 వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని అధికారులు ధీమ వ్యక్తం చేశారు. ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు తెలిపారు.రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యం  రూ. 3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని  అధికారులు వివరించారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి... పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయన్నారు.


ఎర్ర చందనం విక్రయాలు 


రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు అధికారుల తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.