Mallikarjun Kharge Muffler:


ఖరీదైన స్కార్ఫ్..


ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బ్లూ జాకెట్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తో తయారు చేసిన ఫ్యాబ్రిక్‌తో ఈ జాకెట్‌ను తయారు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలన్న సందేశమిస్తూ మోదీ ఈ జాకెట్‌ను ధరించారు. పార్లమెంట్ సమావేశాలకూ ఈ జాకెట్‌తోనే వస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది. అదానీ అంశం గురించి మాట్లాడమంటే మోదీ వేసుకున్న జాకెట్ గురించి మాట్లాడమేంటి అని కొందరు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే...కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్కార్ఫ్‌పైనా రచ్చ నడుస్తోంది. ప్రధాని మోదీ ఏమీ మాట్లాడరు, మమ్మల్నీ మాట్లాడనివ్వరు అని ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు. మోదీని మౌని బాబా అని విమర్శించారు. దీనికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. 


"మల్లికార్జున్ ఖర్గే Louis Vuitton స్కార్ఫ్ వేసుకున్నారు. దీనిపైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయించాలంటరా..? ఇది ఎక్కడ కొన్నారు..? ఎంత ఖర్చు చేశారు..? అనే విషయాలపైనా విచారణ జరిపించమంటారా" 


- పియూష్ గోయల్










బీజేపీ నేతల కౌంటర్‌లు అక్కడితో ఆగలేదు. షహజాద్ పూనావాలా ట్విటర్‌లో ఫోటోలు పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో తయారు చేసిన జాకెట్ ధరించారని, ఖర్గే రూ.56 వేల స్కార్ఫ్ వేసుకున్నారని కంపేర్ చేస్తూ సెటైర్లు వేశారు. ఇంత ఖరీదైన దుస్తులు ధరిస్తూ పేదరికం గురించి మాట్లాడటం వాళ్ల ఆలోచనా విధానాన్ని బయటపెడుతోందని విమర్శించారు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ఖర్గేపై విరుచుకుపడ్డారు. 


"ఖర్గే ఇంత ఖరీదైన స్కార్ఫ్ ధరించారంటే ఆ కంపెనీని ఆయన బాగా అభిమానిస్తున్నట్టా..? ఇది క్యాపిటలిజం అనుకోవాలా..? ఇలా తవ్వుకుంటూ పోతే ఈ విషయం ఎంత వరకైనా వెళ్తుంది" 


వివేక్ అగ్నిహోత్రి, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు