Chandrababu On Amaravati :   ఏపీ రాజధాని విషయంలో జగన్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు.  ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టు లో కేంద్రం అఫిడవిట్ వేసిందని..  శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని  చంద్రబాబు స్పష్టం చేశారు.   శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. రాజధానిగా అమరావతిని మెజార్టీ ప్రజలు ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం  తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని.. కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి  ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పిందని  చంద్రబాబు గుర్తు చేశారు. 


ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ కూడా అమరావతికి ఆమోదం 


అమరావతిని తాము ఏకపక్షంగా..రహస్యంగా రాజధానిగా నిర్ణయించలేదని.. ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేశామన్నరు. అసెంబ్లీలో ప్రస్తుత సీఎం జగన్.. ప్రతిపక్ష నేతగా ఆమోదం తెలిపారని చంద్రబాబ ుగుర్తు చేశారు. .చట్టంలో లేని అధికారాన్ని జగన్   తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు.  జగన్ చేసే విధ్వంసాలను సరిదిద్దడం.. రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు.


అమరావతికి ప్రధాని మోదీ అండగా ఉంటారని చెప్పారన్న చంద్రబాబు


 ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని, అమరావతికి అండగా ఉంటానని ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. అమరావతిపై జగన్ మాట మార్చారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా.. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. కౌన్సిల్ రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూమి ఇచ్చారు. వెయ్యి రోజులకుపైగా అమరావతి రైతులు పోరాడుతున్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను ఇబ్బంది పెట్టారు. అమరావతిపై కులం పేరుతో విషం చిమ్మారు. అమరావతిని దెబ్బతీసేందుకు ఏజెన్సీలతో సర్వే చేయించారు. రాజధాని పూర్తయి ఉంటే లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు.  


సుప్రీంకోర్టులో 23వ తేదీన అమరావతి పిటిషన్లపై విచారణ 


ఏపీ రాజధానిగా అమరావతిని విభజన చట్టం ప్రకారం నిర్ణయించారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. అలాగే సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అంశంపైనే చంద్రబాబు మాట్లాడారు. రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 23వ తేదీన  విచారణ జరగనుంది.                          


సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ - కీలక నిర్ణయం దిశగా అడుగులు ?