Shallow Land In AP: మనకు ఆహారం కావాలంటే రైతన్నలే ఆధారం. వారు పంటలు పండిస్తేనే మనకు భోజనం లభిస్తుంది. కానీ పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా పంటలు, ఉత్పత్తి పెరగాలంటే రైతలు సంఖ్య పెరగాలి. భూమి స్థలం ఎలాగూ పెంచడం సాధ్యం కాదు. కానీ సారవంతమైన భూములు ఉంటేనే పంట ఉత్పత్తులు ఆశించిన స్థాయిలో చేతికి అందుతాయి. ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ విడుదల చేసిన సర్వేలో ఆసక్తిర విషయాలు వెలుగు చూశాయి. తెలుగు రాష్ట్రాల్లో సారవంతమైన భూమి గత ఆరు, ఏడు సంవత్సరాలలో భారీగా తగ్గిపోయింది. దేశంలోని రాష్ట్రాల జాబితాలో చూస్తే నిస్సారవంతమైన భూమి పెరిగిన వాటిలో ఏపీ ఆరో స్థానంలో, తెలంగాణ 17వ స్థానంలో ఉన్నాయి.


స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ’డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’ ప్రకారం.. దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77 శాతం) భూమి క్షీణతకు గురైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని 1,60,20,500 హెక్టార్ల భూభాగంలో 14.84 శాతం (2.37 మిలియన్‌ హెక్టార్లు) భూమి నిస్సారంగా మారిపోయింది. 2011-13 సంవత్సరాల కాలంతో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో   ఉంది. గత ఆరేడు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్లు ఎడారీకరణ చెందగా, తెలంగాణలో 39,652 హెక్టార్ల భూమి నిస్సారంగా మారినట్లు సర్వేలో తేలింది.


గత అయిదేళ్ల కాలంలో ఏపీలో భూక్షీణత దాదాపు ఒకటిన్నర రెట్లకు పైగా అధికమైంది. అటవీసంపద అంతరించిపోవడం, నీటికోత, వ్యవసాయ భూముల్లో నీళ్లు నిలిచిపోవడం, మానవ తప్పిదాలు కారణంగా భూమి క్షీణతకు గురై ఎడారీకీకరణ జరుగుతున్నట్లు ఇస్రో తేల్చింది. 


2011-13తో పోల్చితే 2018-19 నాటికి పచ్చదనం క్షీణత 5,927 హెక్టార్లలో జరగగా ప్రస్తుతం ఇందులో 11,70,184 హెక్టార్లున్నాయి.
నీటి కోత ద్వారా 11,847 హెక్టార్లు తగ్గిపోయింది, ప్రస్తుతం 8,01,280 హెక్టార్లు ఉంది.
లవణాల కారణంగా 1,416 హెక్టార్లు తగ్గి, 1,19,368 హెక్టార్లు అయింది. 
నీరు నీల్వ అయిన కారణంగా 34,007 హెక్టార్లు తగ్గిపోయి, 1,66,341 హెక్టార్లకు పరిమితమైంది.
మానవ తప్పిదాలతో 9,369 హెక్టార్లు నిస్సార భూమిగా మారింది. సెటిల్మెంట్ ద్వారా 16,717 హెక్టార్లు తగ్గిపోయి 66,158 హెక్టార్లకు చేరింది. 


భూ క్షీణత (భూమి నిస్సారంగా మారడం) అధికంగా ఉన్న రాష్ట్రాలు..
రాష్ట్ర భూభాగం పరంగా చూస్తే ఝార్ఖండ్‌లో 68.77% శాతం భూమి క్షీణతకు గురైంది. రాజస్థాన్‌లో 62.06 శాతం, ఢిల్లీలో 61.73 శాతం, గోవాలో 52.64 శాతం, గుజరాత్‌లో 52.20 శాతం భూమి క్షీణతకు గురైనట్లు సర్వేలో వెల్లడించారు. తెలంగాణలో 31.68 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.84 శాతం భూమి క్షీణతకు గురై నిస్సారమైన భూమి తగ్గిపోయింది.