పిల్లలకి కచ్చితంగా నేర్పాల్సిన విషయాలివి



పదేళ్ల వయసు దాటిన పిల్లలను చాలా సార్లు తల్లిదండ్రులు ఇంటి దగ్గర వదిలి వెళుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి అలా చేయాల్సి ఉంటుంది.

అలాంటప్పుడు పిల్లలకు కచ్చితంగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీటిని నేర్పడం వల్ల పిల్లలు జాగ్రత్తగా, సురక్షితంగా ఉంటారు.

తల్లిదండ్రులు తప్ప ఎవరు వచ్చినా డోర్ తీయకూడదని గట్టిగా చెప్పాలి.

కిటికీలోంచి, లేదా డోర్‌కున్న ‘పీప్ హోల్’ ద్వారా చూసి ఎవరు వచ్చారో తెలుసుకోవచ్చు. అలా చూడడం ద్వారా తల్లిదండ్రులు వచ్చారో లేదో తెలుసుకుని డోర్ తీయమని ట్రైనింగ్ ఇవ్వాలి.

కొత్త వాళ్లయినా, తెలిసిన వాళ్లయినా ఎవరు వచ్చినా డోర్ తీయవద్దని గట్టిగా చెప్పాలి.

కిటీకీల వద్దకు లేదా ఇంట్లోని గేటు వద్దకు వచ్చి తెలియని వాళ్లతో మాట్లాడవద్దని, ఏమీ అడిగిన ఇవ్వవద్దని వారికి చెప్పాలి.

పిల్లలు ఒక్కర్నే ఇంట్లో ఉంచినప్పుడు కచ్చితంగా అతనికి ఫోన్ ఇచ్చి వెళ్లండి. అరగంటకోసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండాలి.

పిల్లలకు తల్లిదండ్రులు తప్ప వేరే ఎవరు ఫోన్ చేసినా తాము ఒక్కరే ఉన్నామని చెప్పకూడదని ట్రైనింగ్ ఇవ్వాలి.

గ్యాస్ స్టవ్, కరెంట్ వస్తువులకు దూరంగా ఉండమని గట్టిగా చెప్పాలి. అదెంత ప్రమాదమో కూడా చెప్పాలి.

బాల్కనీలోంచి తొంగి చూడడం, కింద వారితో మాట్లాడడం వంటివి చేయద్దని తెలియజేయాలి.

ఎవరైనా వచ్చి ‘మీ తల్లిదండ్రులు పంపించారు’ లేదా ‘మీ తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అయింది’ వంటివి చెప్పినా నమ్మవద్దని చెప్పాలి.