సాక్షాత్తు అయ్యప్ప స్వామి నడిచెళ్లిన దారి ఇదే..



'ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపం- అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం..ఈ 4దిక్కులు 14భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపం' అంటూ స్వామిని దర్శించుకుంటారు.



మరి అయ్యప్ప సన్నిధి చేరేందుకు చేసే వనయాత్ర గురించి తెలుసా



అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఎన్నో మార్గాలున్నా..అత్యంత ముఖ్యమైనది, అతి ప్రాచీనమైన మార్గం ఎరుమేలి నుంచి ప్రారంభమవుతుంది. ఇది సాక్షాత్తూ అయ్యప్ప స్వామి నడిచి వెళ్లిన వనం అంటారు.



ఎరుమేలి: ఎరుమేలి నుంచి వనయాత్ర మొదలవుతుంది. భక్తులు తమ శరీరానికి రంగులు పులుముకుని, పేటైకళంలో నృత్యం చేసి, పేటయిల్‌ శాస్తాను, వావరు స్వామిని, దర్శించుకుంటారు. వనంలో ప్రవేశించే తమకు తోడుగా రమ్మని ప్రార్థించి యాత్రను ప్రారంభిస్తారు.



కోట్టైప్పడి: అయ్యప్ప స్వామికి ప్రథమ సేవకుడు, స్నేహితుడు వావరు స్వామి కొలువుదీరిన పుణ్యస్థలి కోట్టైపడి.



కాళైకట్టి: అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేస్తుండంగా సాక్షాత్తూ పరమశివుడు భువికి దిగొచ్చి తన వాహనం నందిని కట్టిన ఉంచి స్థలాన్ని మలయాళంలో కాళై అంటారు.



అళుదా నది: అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి స్వామి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చింది. ఆ కన్నీరు అక్కడ ప్రవహిస్తోన్న అలసా నదీలో కలవడం వల్ల దానికి అళుదానది పేరు వచ్చిందంటారు.



అళుదా మేడు: అళుదా నదిలో స్నానం తర్వాత భక్తులు ఎక్కే నిటారైన కొండే అళుదామేడు.



కళిడంకుండ్రు: మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని ఆకాశంపైకి విసరగా అది నేలపై పడిన స్థలమే కళిడంకుండ్రు.



ఇంజిప్పారకోట
కలిడుంకుండ్రు తర్వాత వనయాత్రలో చేరే ప్రాంతం ఇంజిప్పారకోట. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉదయనుడు అనే బందిపోటు దొంగను హతమార్చారట.



కరిమల
ఎత్తైన ఈ కొండ నిట్టనిలువుగా ఉంటుంది. దాదాపు 10కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లాక కరిమల శిఖరాన్ని చేరుకుంటారు.



పెరియాన వట్టం
కరిమల దిగిన తర్వాత చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం పెరియాన వట్టం.



చెరియాన వట్టం
ఇక్కడి నుంచి భక్తులు పంబ వరకు విడిది ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకుని, తిని విశ్రాంతి తీసుకుంటారు.



పంబా నది
ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదిలో స్నానం చేస్తే వనయాత్ర అలసట ఒక్కసారి మటుమాయమవుతుందంటారు. దీనినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు.



నీలిమల
సన్నిధానానికి త్వరగా చేరుకోవాలనే ఉత్సాహం, స్వామివారిని ఎంత త్వరగా దర్శించుకుంటామో అనే ఆతృత ఇక్కడి నుంచే మొదలవుతుంది.



అపొచ్చిమేడు
దుర్దేవతల ప్రీతికోసం నీలిమల శిఖరం రెండు వైపులా ఉన్న లోయలో భక్తులు బియ్యపు ఉండలు విసురుతారు. కపట భక్తులకు ఆత్మ ప్రభోద కల్పించేందుకు దేవతలు ఇక్కడ వేచి ఉంటారని భక్తుల విశ్వాసం.



శబరిపీఠం
శబరిమాత నిర్గుణోపాసనతో అయ్యప్పస్వామి దర్శనం పొందిన ప్రదేశం. శబరిమాత పేరుతో ఇక్కడ విద్యాపీఠం ఏర్పాటు చేసి, పందళ రాజవంశీయులు విద్యాభ్యాసం చేశారని, ఈ ప్రదేశానికి 5వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.



శరంగుత్తి
తొలిసారి అయ్యప్పస్వామి మాల ధరించిన భక్తులను కన్నెస్వాములు అంటారు. కన్నెస్వాములు వనంలోని రక్షాదండంగా ఎరుమేలి నుంచి తెచ్చిన శరాలను ఇక్కడ రావి వృక్షంలో గుచ్చుతారు.



పదినెట్టాంబడి
వనయాత్రలో అత్యంత ముఖ్యమైనది పదినెట్టాంపడి ఘట్టం. పవిత్రత నిండిన దైవాంశమైన మూడార్ల సోపానాలనీ, ముక్తికి మెట్లనీ వీటిని అంటారు. మండల కాల దీక్షా వ్రతం లేని వారు ఈ మెట్లను ఎక్కడానికి అర్హులు కారు.



సన్నిధానం
ఇరుముడితో పదినెట్టాంబడి దాటి సన్నిధానంలోనికి ప్రవేశించిన భక్తులు చిన్ముద్ర ధారియై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరిస్తారు.



జీవిత కాలంలో ఒక్కసారైనా శబరిమల వనయాత్ర చేయాలని చెబుతారు.