స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...



గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.



ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది. ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి.



ఏకదండి: ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం.



ఏకదండి: అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు.



ద్విదండి: రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు. ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు.



ద్విదండి: దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.



త్రిదండి: మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర.



త్రిదండి: శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు.



త్రిదండి: నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.