ధంతేరాస్ రోజు బంగారం ఎందుకు కొనాలి!



ధనత్రయోదశినే ధంతేరాస్ అని కూడా పిలుస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది అక్టోబరు 23 ఆదివారం ధంతేరాస్ వచ్చింది.



అక్టోబరు 22 శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన త్రయోదశి తిథి..అక్టోబరు 23 ఆదివారం సాయంత్రం వరకూ ఉంది. ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేస్తారు కాబట్టి ఏ రోజు చేయాలి అనే ఆలోచలో ఉన్నారు.



ఉపవాసం నియమాన్ని అనుసరించి పూజ చేయాలి అనుకునేవారికి మాత్రం అక్టోబరు 23నే త్రయోదశి పూజ చేసుకోవాలంటున్నారు పండితులు.



అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం.



ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు పెరిగినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు వెనకాడరు.



ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు.



ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు.



ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకుంటారు. రాను రాను సెంటిమెంట్స్ పెరిగి దక్షిణాదివారూ ఫాలో అవుతున్నారు.



బంగారం-వెండి కొనుగోలు చేయడం, లక్ష్మీపూజ చేయడం మంచిదే కదా ఇందులో తప్పేముందని భావిస్తున్నారు. అందుకే తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు.



వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. సాధారణంగా ఈ పూజను ప్రదోష వేళలో చేస్తారు.



సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాల కాలాన్నే ప్రదోషకాలం అంటారు. ధన త్రయోదశి రోజున ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం, అనవసర ఖర్చులు చేయడం చేయరు..


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఈ మూడు విషయాలను నిర్లక్ష్యం చేస్తే అంతే!

View next story