మీరు గణపతి ఆలయానికి వెళుతున్నారా, అయితే ఇలా చేయండి...
వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్దం. సకల కార్యాల్లో ప్రధమ పూజ్యుడు. సకల దేవతాగణాలకు అధిపతి గణపతి.
మహా శక్తి సంపన్నుడైన గణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలు ప్రసాదిస్తాడని విశ్వాసం. అలాంటి గణపయ్యను దర్శించుకునేందుకు ఆలయాని వెళ్లేవారు కొన్ని పాటిస్తే చాలామంచిదంటారు పండితులు.
బొజ్జ గణపయ్య ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి.
వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని , కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలను కానీ అలంకరణకోసం సమర్పించాలి.
21 గరిక గుచ్ఛాలు సమర్పించినా మంచి ఫలితం ఉంటుందట. గరికతో వినాయకుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయని వేదపండితులు చెబుతారు.
గరిక సూర్యునికి కూడా ప్రీతికరం కావడంతో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని, శనివారం వినాయకుడితో పాటూ శనికి గరిక సమర్పిస్తే శనిదోషాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.
గణపయ్య ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణలు చేయాలి
వినాయకుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లైతే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టే వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు.
తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్నకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంటారు.
తెల్లజిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడిని పూసినట్లైతే అత్యంత శీఘ్రంగా కోరిక కోరికలు నెరవేరుతాయట.
వినాయకుడి తిథి అయిన చవితి, జన్మ నక్షత్రం హస్తా రోజు పార్వతీ తనయుడిని పూజిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయని చెబుతారు.
హస్తానక్షత్రం, చవితిరోజు విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం మనశ్శాంతినిస్తుందని చెబుతారు.