ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 22) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కొన్ని చోట్ల  రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 86 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా


తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడన ద్రోణి కోస్తా భాగాలపై కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని వలన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


ఉత్తరాదిలో పిడుగులు


దేశ రాజధానిలో తేలికపాటి వర్షంతో పిడుగులు పడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఆగస్టు 23 బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 24, గురువారం నుండి వాతావరణం క్లియర్‌గా ఉంటుందని, దీని కారణంగా ఉష్ణోగ్రత పెరగవచ్చని భావిస్తున్నారు. అలాగే మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది.


మధ్యప్రదేశ్‌లోనూ ఆగస్టు 15 నుంచి వర్షాలు మొదలు అయ్యాయి. రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారడం వల్ల ఆగస్టు 22 మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు


రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో ఆగస్టు 23న తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని జోధ్‌పూర్, బికనీర్, ఝలావర్, పాలి సహా పలు ప్రాంతాల్లో మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా రాష్ట్రంలో తేమతో కూడిన వేడి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


ఉత్తరాఖండ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో పలు రహదారులు మూసుకుపోయాయి. ఆగస్టు 22వ తేదీ మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.