ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (ఆగస్టు 21) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కొన్ని చోట్ల  రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


‘‘నేడు ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి వలన నేడు మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చెదురుముదురుగా భారీ వర్షాలు, పిడుగులు పడనున్నాయి. విశాఖ నగర శివారు ప్రాంతాలైన అనకాపల్లి - పెందుర్తి వైపుగా వర్షాలు ఉండే అవకాశాలు నేడు సాయంకాలం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కాకినాడ వైపుగా కొనసాగుతున్న వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. నేడు సాయంకాలం రాత్రి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చెదురుమొదురుగా వర్షాలు పడనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.