ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని జనవరి 1 నాటి వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. మొత్తానికి వాతావరణానికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


మరోవైపు, ఏపీలో ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళలో చలి కాస్త పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.


మన్యం జిల్లాలో పెరుగుతున్న చలి
మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మూడు రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలంలో నాలుగు రోజుల నుంచి అర్ధరాత్రి నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా పొగ మంచు ఉంటుండడంతో పెసర, మినుము పంటలకు తీరని నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. తురకపేట, డొంకల బడవంజ, కృష్ణాపురం, దబ్బపాడు, శ్యామలాపురం, చింతలబడవంజ, రావిచెంద్రి తదితర గ్రామాల్లో అపరాల సాగు చేస్తున్నారు. ఈ పంటలపై పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉంటోందని రైతులు పేర్కొంటున్నారు. మామిడి తోటలు కూడా పూత దశలో ఉన్నందున పొగ మంచు కారణంగా పూత మాడిపోతోందని, దీంతో పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 19.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.