Team India:  2023 కొత్త సంవత్సరంపై భారత క్రికెట్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ ఏడాది టీమిండియా క్రికెట్ కు చాలా ప్రత్యేకమైనది. 13 ఏళ్ల తర్వాత భారతదేశం వన్డే ప్రపంచకప్ నకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు కప్ గెలిచింది కూడా 2011లో స్వదేశంలో టోర్నీ జరిగినప్పుడే. ఆ సెంటిమెంట్ కలిసొచ్చి ఇప్పుడు కూడా టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలానే అన్నీ ఓకే అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ తలపడనుంది. పోయినసారి రన్నరప్ తో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి ఆ టోర్నీలోనూ విజయం సాధించాలని భారత క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇంకా ఈ ఏడాది మన క్రికెట్ అభిమానులు జట్టు నుంచి ఏం ఆశిస్తున్నారో చూద్దామా...


వన్డే ప్రపంచకప్ ట్రోఫీ


ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్ లోనే జరగనుంది. 13 ఏళ్ల క్రితం 2011లో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పుడే ధోనీ సారథ్యంలోని టీమిండియా జట్టు కప్పును ముద్దాడింది. అలానే ఇప్పుడు కూడా ఈ మెగా ట్రోఫీని భారత్ గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్ రోహిత్ శర్మ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. 


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్


ఈ ఏడాది జూన్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతమున్న పాయింట్ల ప్రకారం భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంచనాల ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరగనుంది. పోయినసారి జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఆ ట్రోఫీని భారత్ గెలుచుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 


ఐపీఎల్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే


మహేంద్రసింగ్ ధోనీ- ఈ టీమిండియా మాజీ ఫినిషర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. 2023 ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ బ్యాట్ నుంచి ఫినిషింగ్ ఇన్నింగ్స్ లను మరోసారి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన స్టైల్లో మ్యాచులతో పాటు ఐపీఎల్ కెరీర్ ను ముగించాలని ఆశిస్తున్నారు. 


వింటేజ్ ఆట రావాల్సిందే


వన్డేల్లో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీలు గతంలో ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలను నిర్మించారు. మ్యాచ్ విన్నింగ్ పార్ట్ నర్ షిప్ లను నమోదు చేశారు. అయితే చాలాకాలంగా వీరిమధ్య అలాంటి భాగస్వామ్యాలు కనిపించడంలేదు. ఈ ప్రపంచకప్ లో నైనా గతంలో మాదిరిగా వీరిద్దరూ గొప్ప భాగస్వామ్యాలను అందించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.