Weather Latest News: నిన్నటి ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆవర్తనం ఒకటి మరాత్వాడా, పరిసర మధ్య మహారాష్ట్ర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. 


వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీలుగా నమోదైంది. 57 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములుతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. వేడి తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.