RCB VS MI  IPL2024 MI have beaten the hell out of RCB here at the Wankhede: ఐపీఎల్‌(IPL)లో బెంగళూరు (RCB)పరాజయాల పరంపర కొనసాగుతోంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌(MI) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. బెంగళూరు సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పటిదార్‌, దినేశ్‌ కార్తీక్ అర్ధ శతకాలతో మెరిశారు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ రాణించగా... సూర్యకుమార్‌ యాదవ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. 


దినేశ్‌ కార్తీక్‌ ఆటే హైలెట్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు శుభారంభం లభించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్‌ కోహ్లీని బుమ్రా అవుట్‌ చేశాడు. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్‌.. కోహ్లీ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ దగ్గరికి వెళ్లగా... ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 14 పరుగుల వద్ద బెంగళూరు కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం మూడే పరుగులు చేసి కోహ్లీ వెనుదిరిగాడు. కాసేపటికే విల్‌ జాక్స్‌ కూడా అవుటయ్యాడు. దీంతో బెంగళూరు 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌ బెంగళూరును ఆదుకున్నారు. వరుసగా విఫలమవుతున్న రజత్‌ పాటిదార్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. డుప్లెసిస్‌ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లో 61 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 26 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రజత్‌ పాటిదార్‌ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. పటిదార్‌ను కోయెట్జే అవుట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ మరోసారి నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. తర్వాత సౌరవ్‌ చౌహాన్‌ను కూడా బ్రుమా అవుట్‌ చేశాడు. కానీ దినేశ్‌ కార్తీక్‌ బెంగళూరుకు పోరాడే స్కోరును అందించాడు. కార్తీక్‌ కేవలం 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేశాడు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు.


ధనాధన్‌ బ్యాటింగ్‌
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ముంబై ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌-రోహిత్‌ శర్మ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయాన్ని చాలా తేలికగా మార్చేశారు. ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరు బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశారు. 8.5 ఓవర్లలోనే స్కోరు బోర్డును వంద పరుగులు దాటించారు. ఇషాన్‌ కిషన్‌ 34 బంతుల్లో 7 ఫోర్లు, 5  సిక్సులతో 69 పరుగులు చేసి అవుటవ్వగా.... రోహిత్‌ శర్మ 24 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో 38 పరుగులు చేశాడు. వీరిద్దరే విధ్వంసం సృష్టించారంటే తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో సూర్య 52 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. తర్వాత పనిని హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ పూర్తి చేశారు. దీంతో ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.