Weather Updates: రెండు వైపుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోతోంది. ఉదయం వేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఓవైపు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. రాయలసీమలో, తెలంగాణలో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. చలి గాలల ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 11 జిల్లాల్లో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజుల వరకు ఎలాంటి వర్ష సూచన లేకపోయినా.. బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. మరోవైపు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రాష్ట్ర వైద్యశాఖ సూచించింది. చల్లని గాలుల ప్రభావంతో ఏజెన్సీ ఏరియాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. మాడుగులలో 3. 5 డిగ్రీలు, పాడేరు లో 9 డిగ్రీలు, చింతపల్లిలో 8. 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి


దక్షిణ కోస్తాంధ్రంలో వాతావరణం పొడిగా మారింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో నాలుగు రోజులవరకు వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని, వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా నమోదు అవుతుందని.. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఆకాశం నిర్మలంగా ఉండనుంది. పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని రోజులపాటు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టమైంది. రాష్ట్రంలో పగటి పూట గరిష్ణ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు ఉంటుంది. ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్ జిల్లాలలో చలి గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ 11 జిల్లాల్లో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్న తెలిపారు.  కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


Also Read: Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 3 రోజుల్లోనే డబుల్


Also Read: Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి