Telugu News: హోటల్ అనగానే ప్రధాన రోడ్డు వెంట భారీ బోర్డులు, రంగురంగుల లైటింగ్ తో కస్టమర్లను ఆకట్టుకోవడం విశ్వ ప్రయత్నం చేస్తారు. అంతే కాదు వినూత్నంగా డైనింగ్ టేబుల్స్, మెనూ కార్డ్ టేబుల్ పైన ఉంటాయి. కానీ ఈ హోటల్లో ఇవేమి కనిపించవు. సాదాసీదా గా ఓ గల్లీలో చిన్న రేకుల ఇంట్లో. ఇంటి బోజనంలా రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న హోటల్ భారత ప్రభుత్వం నుండి అవార్డు అందుకుంది వరంగల్ జిల్లాలోని ఉప్పలయ్య హోటల్.


ఇంటి భోజనం రుచి....
ఉరుకులు పరుగుల జీవితంలో ఇంటికి వెళ్లి భోజనం చేసే సమయం లేదు. దీంతో గల్లీ కో రెస్టారెంట్ లు, హోటల్స్ వెలుస్తున్నాయి. బీజీ జీవితంలో ఎక్కడో అక్కడ తినాల్సిన పరిస్థితి. జనాలు కూడా ఫాస్ట్ ఫుడ్, బిర్యాని లు తినే కాలం. అయినా సదా సీదా సాంప్రదాయ భోజనం అందిస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన శ్రీనివాస్. 30 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ తండ్రి ఉప్పలయ్య ఆయన పేరుతో నర్సంపేట పట్టణంలోని సుభాస్ కాలనీలో తన చిన్న ఇంట్లో ఇంటి  భోజనాన్ని ప్రారంభించారు. ఇంట్లో అమ్మ భార్య చేసే రుచిని అందిస్తూ అందరిని మన్ననలు పొందారు ఉప్పలయ్య. దీంతో హోటల్  చిన్నదా పెద్దదా అనే సంబంధం లేకుండా రుచికరమైన ఇంటి భోజనాన్ని అందిస్తుండడంతో ఉప్పలయ్య హోటల్ భారత ప్రభుత్వం గుర్తించే స్థాయికి ఎదిగింది.




కుటుంబమే వర్కర్స్...
ఈ హోటల్ లో బయటి వర్కర్స్ తో పని చేయించకుండా. ఉప్పలయ్య ఆయన కుమారుడు, కూతురు, కోడలు స్వయంగా వంతచేయడం, హోటల్ కు వచ్చే కస్టమర్స్ కు వడ్డించడం చేస్తారు. దీంతో రుచిలో తేడా రాకపోవడంతో మనం తినే భోజనాన్ని అందించాలని హోటల్ ను నడిపాడు ఉప్పలయ్య. అయితే ఉప్పలయ్య  2004లో మరణించారు. అప్పటికే ఉప్పలయ్య కుమారుడు శ్రీనివాస్ హోటల్ నిర్వహణలో కొనసాగుతుండటంతో తండ్రి అందించిన ఇంట్లో తినే భోజనాన్ని అందిస్తుండడంతో విజయవంతంగా కొనసాగుతుంది. మూడు రకాల కూరగాయలు, పచ్చిపులుసు, పెరుగుతో 90 రూపాయలకు ఫుల్ భోజనం అందిస్తారు. ఇక్కడికి పచ్చ పెన్ను ఉద్యోగి నుండి దినసరి కూలీ ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. వివిధ పనుల మీద నర్సంపేట పట్టణానికి వచ్చిన వారు ఇంటి భోజనం చేయాలనుకుంటే ఉప్పలయ హోటల్ కు వస్తారు.


రుచికి మెచ్చి కేంద్ర ప్రభుత్వ అవార్డు


అయితే రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ( మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ ) అధికారులు విధినిర్వహణలో నర్సంపేట కు వచ్చారు. భోజనం కోసం ఉప్పలయ్య హోటల్ లో భోజనం చేసి వెళ్ళారు. తిరిగి ఆగస్టు 12వ తేదీన వచ్చి భోజనం చేసిన తరువాత సాధారణ ధరకు నాణ్యమైన, రుచికర భోజనం అందించి నందుకు ఉప్పలయ్య హోటల్ యజమాని శ్రీనివాస్ కు అవార్డు అందజేశారు. హోటల్ అధికారులు మెచ్చుకొని అవార్డు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యానని శ్రీనివాస్ తెలిపారు.


కట్టెల పొయ్యి మీద వంటలు


ఈ హోటల్లో అన్నం కూరలు సాంప్రదాయపడ్డంగా కట్టెల పొయ్యి మీద వండడం జరుగుతుంది. పోపుకు సంబంధించిన వాటిని మాత్రమే క్లాస్ మీద చేయడం జరుగుతుంది శ్రీనివాస్ తెలిపారు. 150 నుండి 200 భోజనాలు అందిస్తానని చెప్పారు. భోజనం చేసిన వారు రుచికరంగా ఇంట్లో తిన్నట్టు ఉందని అంటే ఆనందం అనిపిస్తుందని  శ్రీనివాస్ అన్నారు.