- ABP దేశం ఎఫెక్ట్... ప్రక్షాళన దిశగా ఎంజీఎం మార్చురీ 
- ఏబీపీ దేశం కథనంతో స్పందించిన కెఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్
- తమ దృష్టికి తీసుకురావడం మంచి పరిణామం- డాక్టర్ మోహన్ దాస్


వరంగల్ : వరంగల్ ఎంజీఎం మార్చురీ ప్రక్షాళనకు అధికారులు రంగంలోకి దిగారు. మార్చురీలో డబ్బులు ఇస్తేనే శవాలకు పోస్టుమార్టం చేస్తున్న ఓ ఘటనకు సంబంధించి ఏబీపీ దేశం చేసిన స్టోరీ ప్రసారం కావడంతో అధికారులు సిబ్బందిపై వేటుకు సిద్ధమయ్యారు. 


ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మెడికల్ సేవలు అందించే ఎంజీఎం ఆస్పత్రిలో పైసలు ఇస్తేనే వైద్యంతోపాటు ఇతర పనులు కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రోగులకు వైద్యం విషయం పక్కన పెడితే.. ఎంజీఎం మార్చురీలో శవాలపై పేలాలు ఏరుకునేలా కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. మార్చురీ సిబ్బందికి వేల రూపాయలు లంచం ఇస్తేనే శవాలకు పోస్ట్ మార్టం జరగని పరిస్థితి నెలకొందని బాధితులు ఆరోపించారు. మార్చురీలో లంచగొండులు అంటూ ఏబీపీ దేశం ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో వైద్యారోగ్య అధికారులు రంగంలోకి దిగారు.


మార్చురీ లంచాల తతంగంతో వైద్య శాఖ అధికారుల పరువు రోడ్డుమీద పడడంతో యంత్రాంగం స్పందించింది. ఎంజీఎం, మెడికల్ కాలేజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్చురీ లంచగొండులపై చర్యలు సిద్ధమయ్యారు. పైసలు ఇస్తేనే పోస్ట్ మార్టం చేసే సిబ్బందిని విధుల నుండి తొలగించడంతో పాటు, మార్చురీ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, మృతుల బంధువులను తప్ప ఇతర వ్యక్తులను లోపలికి రాకుండా చర్యలు చేపడుతున్నామని ‘ఏబీపీ దేశం’కు అధికారులు చెప్పారు.


ఓ ప్రకటనలో ఎంజీఎం హాస్పిటల్ సూపరిటెండెంట్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఎంజీఎం హాస్పిటల్ మార్చురీకి సంబంధించిన వీడియో పరిశీలించాం. వీడియోలో డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి జన్ను భిక్షపతి, అతడు ప్రైవేట్ ఫొటో గ్రాఫర్‌ అని తెలిపారు. అతడు ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ విషయాన్ని ఫోరెన్సెక్ డిపార్ట్ మెంట్ విభాగాధిపతికి, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కు తదుపరి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఎవరైనా ఉద్యోగులతో కుమ్మక్కై ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారని ఎంజీఎం సూపరింటెండ్ పేర్కొన్నారు. ఎంజీఎం హాస్పిటల్‌లో ఏ విధమైన చికిత్సకైనా, పోస్ట్ మార్టం కోసమైనా వైద్య సేవలు ఉచితం ఇస్తున్నాం. ప్రజలు హాస్పిటల్ లో పనిచేసే ఏ సిబ్బందికి కూడా డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యానికి సహకరించాలని కోరారు.  


వరంగల్ ఎంజీఎం మార్చరీలో ప్రతిరోజూ ఐదు నుంచి పది వరకు శవాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అయితే పోస్టుమార్టానికి వెళ్తున్న శవాలపై డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి దందాకు తెరలేపారు సిబ్బంది. తాజాగా పస్తం శ్రీను అనే వ్యక్తి 5 రోజుల కిందట వరంగల్ - కాజీపేట మధ్య వందేబారత్ ట్రైన్ ఢీ కొని మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించారు జిఆర్పీ పోలీసులు. అసలు సమస్య అక్కడే మొదలైంది.


పోస్ట్ మార్టం చెయ్యాలంటే రేటు తప్పని సరి
వరంగల్ ఎంజీఎం మార్చరీలో సిబ్బందితో పాటు పంచానామ రాసే కానిస్టేబుల్ సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించే డాక్టర్ కు రూ.3500, ఫోటోగ్రాఫర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కోసం రూ. 3500, పోలీస్ కానిస్టేబుల్‌కు రూ. 3500, అంబులెన్స్ పేరుతో రూ.3500 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఘటన ABP దేశం కెమెరాకు చిక్కింది.