Errabelli Dayakar Rao Visits to Devaruppula Kasturba School: వరంగల్ : దేవరుప్పుల మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో రెండు కిందట భోజనంలో బల్లి పడిన ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. అలాంటి ఘటన జరగడంతో స్కూల్ ను సందర్శించి విద్యార్థినిలతో కలిసి స్కూల్ సమస్యలను తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. మంత్రి వెంట కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుందని, అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులతో కలిసి స్కూల్, అవరణ, పరిసరాలు, వంట గది, భోజన హాల్ లను మంత్రి పరిశీలించారు.
స్కూల్ కోసం రూ.20 లక్షలు మంజూరు
పాఠశాల అవసరాల కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భోజనంలో బల్లి రావడం ఘటనలో బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుండి స్కూల్ కి లక్ష రూపాయలు అందచేశారు. విద్యార్థులతో పాటు కూర్చొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. సంఘటన జరిగినా తల్లితండ్రులకు సమాచారం ఇవ్వని ప్రిన్స్ పాల్  తీరుపై మంత్రి మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులకు, స్కూల్ సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం వారి చదువుపై ప్రభావం చూపుతుందని, కనుక వారికి అందించే ఆహారం విషయంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని చెప్పారు.






అసలేం జరిగింది..
జనగామ జిల్లా దేవరుప్పుల కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఈ ఘటనలో 25 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు వీరిని వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే దోసకాయ కర్రీ లో బల్లి పడిందని.. దానినే తమకు పెట్టారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనం తిన్న తరువాత కొద్ది మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయని విద్యార్థినులు తెలిపారు. బల్లి పడిందని తెలియక తాము తినడంతో అస్వస్థతకు గురయ్యామని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు చాలా మంది జనగామ హాస్పిటల్ కి చేరుకుని పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.


Also Read: మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - పోలీసుల రహస్య విచారణ !