పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు జనగామ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన, రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరనున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లాలోని జనగాం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పాడు. 15 ఫిబ్రవరి 1944లో వరంగల్ జిల్లాలో జన్మించిన పొన్నాల 1980 నుంచి కాంగ్రెస్‌లో పని చేస్తున్నారు. 


జనగామ టికెట్‌ ఇస్తారా ?
జనగామ అభ్యర్థిగా పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్‌ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని అభ్యర్థి అని చెప్పినా అధికారికంగా బీఆర్ఎస్‌ ప్రకటించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానంలో పొన్నాలను బరిలోకి దించుతారన్న ప్రచారం జరుగుతోంది. బీసీ కార్డును ప్రయోగిస్తే లాభం చేకూరుతుందని బీఆర్ఎస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


లేఖలో ఘాటు కామెంట్స్
ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు పొన్నాల. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయన్న ఆయన, తన లాంటి సీనియర్‌ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్‌మెంట్‌ కోసం వేచి చూడడం దురదృష్టకర పరిణామమని వెల్లడించారు. ఢిల్లీకి వచ్చిన 10 రోజులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుద్దామని ప్రయత్నిస్తే, ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదన్నారు. 


పీవీ నరసింహారావు పిలుపుతో
అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో కీలకమైన ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలో, అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు పిలుపుతో కాంగ్రెస్‌లో చేరానన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరానని,  నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షుడి వరకు  కీలక పదవులను చేపట్టినట్లు చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసినట్లు లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తీవ్రంగా కలిసివేశాయని, 2015లో పిసిసి అధ్యక్ష పదవి నుంచి  అకారణంగా తొలగించినా, దాదాపు 9 ఏళ్లు ఏలాంటి పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేశానన్నారు. 


బలి పశువును చేశారు
2014లో దేశవ్యాప్తంగా పార్టీ ఓటమిపాలయితే, తెలంగాణ ఓటమికి తనను బలి చేశారన్న పొన్నాల, అదే 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడకపోయినా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోలేదని, పైగా పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తాను పార్టీ సిద్ధాంతాల ప్రకారం బడుగు బలహీన వర్గాలు అంశాలను ఎత్తిచూపడం, పార్టీ బలోపేతానికి తన వంతుగా అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నానని చెప్పారు. ఎంత మంది ఎన్ని రకాలుగా తనపై మాట్లాడిన పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని స్పష్టం చేశారు