Sitamma Sagar Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు పనులు ఆపాలని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. పనులు ఆపకపోతే ఊరుకోబోమని, యంత్రాలు తగుల బెడతామని హెచ్చరించారు. ఈ మేరకు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగి వారిపై తీవ్రంగా మండిపడ్డారు. చర్ల మండలం కొత్తపల్లికి వెళ్లిన పొదెం వీరయ్య.. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. కొరెగడ్డ గ్రామ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేంత వరకు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు చేయకూడదని పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. 


'కోర్టు చెప్పినా ఆపకుండా పనులు చేస్తారా?'


పరిహారం చెల్లించకుండా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య గుర్తు చేశారు. కోర్టు స్టే కూడా లెక్కచేయకుండా ప్రాజెక్టు పనులు చేయడం ఏమిటని అక్కడి అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. అధికర పార్టీ నేతల అండదండలతో పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. తమకు పరిహారం అందలేదని ఒకవైపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, వారికి పరిహారం ఇవ్వకుండా పనులు కొనసాగించడం సరికాదని అన్నారు. పనులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 


పనులు ఆపాలని ఎన్జీటీ ఆదేశాలు


సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపుర మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద సీతమ్మ సాగర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారని ఇద్దరు వ్యక్తులు ఎన్జీటీ దక్షిణాది బెంచ్ లో ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా సీతమ్మ సాగర్ పనులు నిలిపి వేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెల్లం నరేష్, ములుగు జిల్లాకు చెందిన బూర లక్ష్మీనారయణ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌- ఈఐఏ 2006 నోటిఫికేషన్ ప్రకారం అక్కడ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


2022 ఫిబ్రవరి 24వ తేదీన చీఫ్ ఇంజినీర్, ప్రాజెక్టు ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం రికార్డులు సమర్పించిందని.. ఆనాడే అక్కడ ఈసీ లేకుండా నిర్మాణం జరపబోమని ఎన్జీటీకి తెలిపినట్లు పేర్కొంది. ఈసీ క్లియరెన్సె లేకుండా ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకొళ్లవద్దని ఎన్జీటీ ఆదేశించింది. ఈఐఏ అధ్యయనం, పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా పనులు కొనసాగించవద్దని ఎన్జీటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు నది మీద కడుతుండటమే కాకుండా.. ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అనుమతులు తప్పకుండా సంబంధిత శాఖల నుండి తీసుకోవాలని చెప్పింది. ఈ ప్రాజెక్టులో రెండు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయితే.. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని ఎన్జీటీ స్పష్టంగా పేర్కొంది.