Mahabubnagar Crime News: "ఒకసారి మీ చేతి రేఖలు లేదా పుట్టు మచ్చలు చూపించండి. శరీరంపై ఏ చోట ఉన్నా సరే నిరభ్యంతంరంగా చూపించాలి. అలా చూపిస్తే వాటి ఆధారంగా మీ జాతకం చెప్తాం.. అంతేకాదు మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మారుస్తామంటూ" మహిళలకు పలువురు జ్యోతిష్యులు మాయ మాటలు చెప్పారు. అది నమ్మి శరీరంలో ఎక్కడెక్కడో ఉన్న పుట్టు మచ్చలు చూపించారంటే ఇక మీ పని అయిపోయినట్లే. ఎందుకుంటే పుట్టు మచ్చలు చూసే నెపంతో నగ్న చిత్రాలను సేకరిస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఎట్టకేలకు ఆ నిందితులు పోలీసులకు చిక్కారు. 


అసలేం జరిగిందంటే..?


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, వికారాబాద్ జిల్లా ఆమన్ గల్, రంగారెడ్డి జిల్లాలో కొందరు జ్యోతిష్యులు జ్యోతిష్య కేంద్రాలు తెరిచారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిపిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా పేద మహిళలే లక్ష్యంగా ఈ మోసాలకు పాల్పడ్డారు. శరీరంపై పుట్టు మచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తే జాతకం పక్కాగా ఉంటుందని వివిరించారు. అలాగే వాటిని ఫొటో తీసి పెద్ద స్వామీజీకి పంపిస్తామని.. అలా చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పి.. వారి ఫొటోలు, వీడియోలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తారు. ఇలాగా చాలా మంది మహిళల నుంచి నగ్న ఫొటోలు సేకరించినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు పురుషులు కూడా ఉండడం గమనార్హం. 


జాతకం మారుస్తామంటూ నగ్న ఫొటోలు సేకరించిన అక్రమార్కులు చివరికి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. చాలా మంది భయపడిపోయి వారు అడిగినన్న డబ్బులు ముట్టజెప్పారు. మరికొందరేమో ధైర్యం చేసి ఇవ్వమని తెగేసి చెప్పారు. బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే వెళ్లి పోలీసులకు చెప్పగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పోలీసులు జైనుద్దిన్, రాములు అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పూర్తి స్థాయిలో విచారించగా.. తిరుపతి, శంకర్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో వీరిని పట్టుకునేందుకు ఓ పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 


దెయ్యం వదిలిస్తానంటూ యువతితో పెళ్లికి సిద్ధమైన దొంగబాబా


ఓ యువతికి దెయ్యం పట్టిందని నమ్మించిన దొంగ బాబా, పెళ్లి చేసుకుని రక్షించుకుంటానని చెప్పి మోసం చేశాడు. పది రోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకోగా.. యువతి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. హైదరాబాద్‌ టోలిచౌక్‌కు చెందిన ఓ యువతి నెల్లూరులోని ఓ దర్గాకు చెందిన హఫీజ్‌ పాషా వద్దకు చికిత్స కోసం వెళ్లింది. యువతికి దెయ్యం పట్టిందని నమ్మించిన బాబా, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులను నమ్మించాడు. మూడేళ్లుగా యువతికి చికిత్స చేస్తున్నా నయంకాలేదు. కొన్ని రోజుల్లో యువతి చనిపోతుందని కుటుంబ సభ్యులను నమ్మించిన బాబా.. పెళ్లి చేసుకుని యువతి ప్రాణాలు కాపాడుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె బంధువులు బాబాతో పెళ్లికి ఒప్పుకున్నారు.  


దొంగ బాబాకు ఏడు పెళ్లిళ్లు 


దీంతో బాబాతో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు. ఈనెల 11న హైదరాబాద్‌ టోలిచౌక్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాబా ముఖం చాటేశాడు. అనుమానంతో యువతి బంధువులు బాబా బంధువుల సంప్రదించగా హెల్త్ బాగోలేదని చెప్పించాడు. బాబా ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా గతంలోనే అతడు అనేక మందిని పెళ్లి చేసుకున్నట్టు అసలు విషయం తెలిసింది. ఈ దొంగ బాబాపై నెల్లూరులోని పలు పోలీస్‌ స్టేషన్లలో 13 కేసులు నమోదు అయ్యాయని తెలిసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో హఫీజ్ పాషాపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆ బాబా ఏడు పెళ్లిళ్లు జరిగినట్టు పోలీసులు తెలిపారు.