Congress Mulugu President Kumara Swamy Dies: ములుగు : కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారన్న మృతి చెందారు. నాలుగు దశాబ్ధాలుగా ములుగు కేంద్రంలో రాజకీయంగా, ప్రజా సంఘాలతో మమేకమవుతూ ఆటో, జీపు కార్మికులకు అండదండగా ఉన్న నల్లెల్ల కుమారస్వామి అనారోగ్యంతో గురువారం ఉదయం మృతిచెందారు. క్యాన్సర్​ వ్యాధి బాధపడుతున్న నల్లెల్ల ఏడాది నుంచి చికిత్స పొందుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఎలాంటి వివాదాలున్నా, పరిష్కరించే నాయకుడు కన్నుమూయడంతో ములుగు పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య విజయకుమారితో పాటు కుమారుడు భరత్, కూతురు చైతన్య ఉన్నారు. 
సీఎం కేసీఆర్​తో అనుబంధం.. 
1981లో ఏబీవీపీ అధ్యక్షునిగా విద్యార్థి దశ నుంచి లీడర్​గా పనిచేసిన నల్లెల్ల కుమారస్వామి 1986లో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి చందూలాల్​ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1988లో సర్పంచ్ గా పోటీచేసి ఓడిపోయారు. 1994లో మళ్లీ సర్పంచ్ గా పోటీచేసి గెలిచిన కుమారస్వామి 1995 నుంచి 99వరకు ములుగు సర్పంచ్​గా పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్​ ఆవిర్భావంలో భాగంగా 2001లో టీఆర్ఎస్ లో చేరిన నల్లెల్ల ఎంపీపీగా గెలిచి 2006 వరకు సేవలు అందించారు. కేసీఆర్​ ములుగు పర్యటన సందర్భంగా స్థానికంగా జరిగిన బహిరంగ సభలో కీలకంగా వ్యవహరించి సభ సక్సెస్​కు కృషిచేశారు. అప్పటినుంచి ఇప్పటికీ ములుగు అంటే బీఆర్ఎస్​నేతలతో కూడా నల్లెల్ల కుమార్​ బాగున్నాడా అని సీఎం కేసీఆర్​గుర్తుచేస్తారంటే అతిశయోక్తిలేదు. ఆ తరువాత 2008లో కుమారస్వామి భార్య విజయ కుమారి ములుగు సర్పంచ్ గా పనిచేశారు. 


నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నల్లెల్ల 2015 నుంచి కాంగ్రెస్​ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జిల్లా డీసీసీ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ములుగుకు అవకాశం కల్పించకపోవడంతో ముందుండి ములుగు జిల్లా ఉద్యమాన్ని నిర్వహించారు. పలువురు లీడర్లతో సమన్వయపరుచుకొని జిల్లా సాధన ఉద్యమాన్ని నడిపారు. నిరాహారదీక్షలు, బంద్ లు, ర్యాలీలు నిర్వహించి ఉవ్వెత్తున ఉద్యమం నడపడంతో 2019లో సీఎం కేసీఆర్​జిల్లాను ప్రకటించారు. అందరితో కలివిడిగా ఉండే మహా నాయకుడు నల్లెల్ల ఇక లేరన్న వార్త ములుగు జిల్లా ప్రజలు  జీర్ణించుకోలేకపోతున్నారు.


కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే సీతక్క
ములుగు ఎమ్మెల్యే సీతక్క నల్లెల్ల కుమారస్వామి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అని అప్యాయంగా పిలుచుకునే నల్లెల్ల ఇకలేరు అనే విషయాన్ని గుర్తుచేసుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ములుగు బాలికల పాఠశాలలో చదివినప్పుడు కుమారన్న ఏబీవీపీ లీడర్​ గా స్కూల్ కు వచ్చేవారని సీతక్క గుర్తు చేసుకున్నారు. సీతక్క అనుచరునిగా వ్యవహరిస్తున్న నల్లెల్ల కుమార్​ మృతితో జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సీతక్కకు కుడి భుజంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అనేక విజయాలలో కీలక భూమిక పోషించిన నల్లెల్ల కుమార్ అన్న అంతిమయాత్రకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. 


నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది, కాంగ్రెస్​లీడర్​ గండ్ర
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గా ఉంటూ ములుగు పట్టణంలో జీపు, ఆటో యూనియన్లకు పెద్దన్నలా వ్యవహరించే వారని ఎమ్మెల్యే పెద్ది, మరో నేత గండ్ర అన్నారు. ఆప్యాయంగా పిలుచుకునే కుమారన్న లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హాత్​సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నెల 7న ములుగులో కార్నర్ మీటింగ్ అనంతరం స్వయంగా నల్లెల్ల ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని పరామర్శించారు.  


నల్లెల్ల కుమారస్వామి మృతి విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు ఆయనకు నివాళులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే సీతక్కతోపాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి స్వయంగా వచ్చి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్​ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు, మహబూబాబాద్​ కాంగ్రెస్​లీడర్​వేం నరేందర్​తదితరులు కుమారస్వామి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ములుగులో నిర్వహించిన అంతిమయాత్రలో పలువురు లీడర్లు పాల్గొన్నారు.