Warangal News: మావోయిస్టు పార్టీ కోవర్ట్‌లను హతం చేస్తుంటే... మరోవైపు మావోయిస్టులు పార్టీని వీడుతున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు బుజగుండ్ల అనిల్‌ ఆలియాస్‌ క్రాంతి కిరణ్‌ పోలీసులకు లొంగిపోయాడు. ఈయన సెంట్రల్‌ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ అలియాస్‌ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా పనిచేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఎదుట గురువారం వీళ్లిద్దరు లొంగిపోయారు. ఆనిల్‌ అలియాస్‌ క్రాంతి కిరణ్‌ వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం ఆర్షనపల్లి గ్రామానికి చెందిన వారు. 


తల్లిదండ్రుల బాటలో...
అనిల్ తల్లిదండ్రులు ఇద్దరు అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో పనిచేసి ఇద్దరు మరణించారు. హైదారాబాద్‌లో ఎల్‌.ఎల్‌.బి. చివర సంవత్సరం చదువుతున్న సమయంలో మావోయిస్టు అనుబంధ సంస్థైన డి.ఎస్‌ఈయు విభాగంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుడిగా పనిచేశాడు అనిల్. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కరావు ప్రోత్సహంతో 2021 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన అనిల్‌ కొద్ది రోజులు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, కటకం సుదర్శన్‌ అలియాస్‌ అనంద్‌ల వద్ద వ్యక్తిగత సహయకుడిగా పని చేశాడు. అనంతరం 2023లో పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం మడ్‌ ఏరియా కమిటీ సభ్యుడుగా బాధ్యతలు చేపట్టాడు. అక్కడే సెంట్రల్‌ కమిటీ సభ్యుడు, సెంట్రల్‌ రిజినల్‌ బ్యూరో కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోను అధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ప్రచారకర్తగా 2023 నవంబర్‌ వరకు పని చేశాడు. మావోయిస్టు పార్టీ గత నెల జులైలో ఆనిల్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించింది. 


గత జులై 19న బీజాపూర్‌ జిల్లా పరిధిలోని సిమలదొడ్డి గ్రామ ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నాడని సీపీ అంబర్ కిషర్ ఝా తెలిపారు. సీమల దొడ్డి ఎన్ కౌంటర్ తరువాత జులై చివరి వారంలో అనిల్‌ తిరిగి కేంద్ర కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ అలియాస్‌ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా చేరాడు. ఆగ్రనేతల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు, వ్యాసాలు, వీడియోలు, ఇంటర్‌నెట్‌ అనుబంధ కార్యకలపాలు నిర్వహించేవాడనీ వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.


ఆనారోగ్యంతో జనజీవన స్రవంతిలోకి.
మావోయిస్టు పార్టీలో రెండేళ్లకుపైగా పనిచేసిన అనిల్‌ గత కొద్ది రోజులుగా నరాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తోడు మావోయిస్టు పార్టీకి ప్రజల నుంచి ఎదురౌవుతున్న వ్యతిరేకత, ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు అకర్షితుడై జనజీవన స్రవంతి కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపొవడం జరిగిందనీ సీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు అనిల్‌పై ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన రివార్డును నాలుగు లక్షల రూపాయల చెక్కును లొంగిపోయిన అనిల్‌కు కమిషనర్ అందజేశారు. 


Also Read: గణేష్ మండపాలకు రేవంత్ రెడ్డి గుడ్‌ న్యూస్ - ఉత్సవాలపై సమీక్షలో సీఎం