Farmer Died In Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పని చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి... వ్యవసాయ క్షేత్రంలోనే కుప్పకూలిపోయాడు ఆ అన్నదాత. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు. 


దుంపిలపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య(45) శుక్రవారం ఉదయం రోజూలాగే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. మిరప తోటలో కలుపు తీసేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న అచ్చుకానిని పక్కన పెట్టాలని తీయబోయాడు. అలా తీసుకెళ్తున్న క్రమంలోనే.. మిరప తోటలో పడి ఉన్న విద్యుత్ తీగలకు తాకాడు. అచ్చుకాని ఇనుపది కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే మృతి చెందాడు. అతడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూడగా... కొమురయ్య మృతి చెంది ఉన్నాడు. అది చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడికి భార్య పద్మ, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. 


బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. రైతు మృతి! 


అతనొక నిరుపేద. ఎన్నో ఏళ్లుగా కష్టాలతో సహజీవనం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీమ్ ద్వారా అతనికి ఒక ట్రాక్టర్ మంజూరు అయింది. ట్రాక్టర్ నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ విషాద సంఘటన కరీంనగర్  లోని తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే మాన కొండూరు మండలం బంజరు పల్లె గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్ పాలెరు పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. శంకర్ కు  భార్య లక్ష్మి ఇద్దరు కూతుళ్లు పూజ, అంజలి ఉన్నారు. అంజలి ఇటీవలనే డిగ్రీ పూర్తి చేయగా పూజ తన తల్లికి పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది. 


దళిత బంధు స్కీంలో ట్రాక్టర్ మంజూరు..


తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం కింద శంకర్ కు ఓ ట్రాక్టర్ మంజూరైంది. దీనిని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గత నెల ఆరో తారీఖున అందజేశారు. ఇక తమ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని సంతోషపడ్డారు. అయితే శంకర్ కు డ్రైవింగ్ రాకపోవడంతో నేర్చుకోవాలని అనుకున్నాడు. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ కు చెందిన మల్లేశం అనే అతన్ని సంప్రదించగా అందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఒక రైతుకు చెందిన వ్యవసాయ భూమి వద్ద మల్లేశం శంకర్ కు ట్రాక్టర్ నేర్పిస్తుండగా అదుపుతప్పింది. ట్రాక్టర్ స్పీడ్ గా దూసుకెళ్లి వ్యవసాయ బావిలో పడిపోయింది. 


బావిలో మునిగిపోయిన ట్రాక్టర్.. 


అయితే మల్లేశానికి ఈత రావడంతో బావి నుంచి బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన పశువుల కాపరి పక్కనున్న రైతులందరికీ సమాచారం అందించాడు. కానీ అప్పటికే  బావిలో ట్రాక్టర్ తో సహా శంకర్ మునిగిపోయాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం కోసం గాలించారు. క్రైన్ తెప్పించి ట్రాక్టర్ ను బావిలోంచి బయటకు తీశారు. చివరకు శంకర్ మృతదేహాన్ని బయటకు తీసి బంధువులకు అందించారు. ఆర్థిక సమస్యలు పోయి జీవితంలో కుదురుకుంటున్న సమయంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.