ములుగు జిల్లాలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య తీరు వివాదస్పదంగా మారింది. తన వాహనానికి పశువులు అడ్డు వచ్చాయని ఓ పశువుల కాపరిపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్ నడుస్తోంది. పశువుల కాపరిపై చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారట. మంగపేట మండలం గంపోనిగూడేనికి చెందిన బోయిని యాకయ్య అనే వ్యక్తి పశువులను మేతకు తీసుకువెళ్తుండగా కలెక్టర్ వాహనానికి పశువులు అడ్డుగా వచ్చాయి. దీంతో యాకయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్..అతని సెల్ ఫోన్ లాక్కొన్నారని బాధితులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో యాకయ్య ఇంటికి వెళ్లిన అధికారులు జరిమాన విధించారని సమాచారం. 


అధికారులు మాత్రం చెట్లు నాశనం చేస్తుంటేనే ఫైన్ వేశామని చెబుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయనే పేరిట యాకయ్యకు రూ.7,500 జరిమానా విధించడమే కాకుండా నల్లా కనెక్షన్ తాత్కాలికంగా సీల్ వేశారు. కలెక్టర్ తీసుకున్న సెల్ ఫోన్ ను యాకయ్య కు పంచాయతీ కార్యదర్శి హీరు తిరిగి అందించారు. జరిమాన కట్టకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో డబ్బులను యాకయ్య చెల్లించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పాడి పశువులు నాశనం చేస్తుండడంతో జరిమానా విధించామని కలెక్టర్ వెల్లడించారు. జరిమానా సొమ్మును పంచాయతీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించామన్నారు. దీనిపై బాధితులు వాపోతున్నారు. తెలిసీ తెలియ చేసిన తప్పునకు ఇలాంటి శిక్ష వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 


ఈ మధ్య ఎద్దుల బండి యజమానిపై కేసు పెట్టిన సింగరేణి జీఎం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .. ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ నాలుగు పైసలతో కుటుంబాన్ని పోషించు కుంటున్నా డు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో  కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. ఎక్కడ పోయాలో దానికి తెలియదు. వచ్చింది పోసేసింది. ఆపడం యజమానికి కూడా సాధ్యం కాదు. కానీ అలా పోయడం... సింగరేణి జీఎం కార్యాలయం సిబ్బందికి నచ్చలేదు. అలాగని ఎద్దు ఓనర్‌తో గొడవపడలేదు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


సింగరేణి జీఎం చెబితే కేసు పెట్టమా అని పోలీసులు కూడా వెంటనే.. కేసు నమోదు చేశారు.  వెంటనే ఎద్దు యజమానిక అయిన సుందర్ లాల్ ను స్థానిక పోలీసులు పిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని అందుకు కేసు నమోదు చేసి కోర్టు కు పంపిస్తామని అన్నారు. పోలీసుల పిలుపుతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్.. అని అడిగాడు.. దీంతో కేసు నమోదయిందని కోర్టుకి పోయి ఫైన్ చెల్లించాలని ఆదేశించారు. చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్ లాల్ ఆవేదనతో చెప్పారు..కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న తరుణంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు.