Errabelli Pradeep Rao : వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.  వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇకపై టీఆర్​ఎస్​ పార్టీలో కొనసాగనని తెలిపారు. పార్టీలో తనకు విలువలేదని అందుకనే రాజీనామా చేస్తున్నట్లుఎర్రబెల్లి ప్రదీప్​ రావు అన్నారు. వరంగల్ ను రూ.4 వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసుంటే ప్రజలు నిజంగానే బ్రహ్మరథం పడతారని ఎమ్మెల్యే నరేందర్ ఉద్దేశించి విమర్శలు చేశారు. నరేందర్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని ప్రదీర్ రావు సవాల్​ విసిరారు. వరంగల్ అభివృద్ధి ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆయన సంస్కారహీనుడని మండిపడ్డారు. తనకు టికెట్ ఇస్తానని నమ్మించి మోసం చేశారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. ఒకవేళ నరేందర్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. బతికున్నంత కాలం నరేందర్ కు మద్దతిస్తానని ఎర్రబెల్లి తెలిపారు.


ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులు 


ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అనుచరులు తనను వేధిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. తనను ఉద్దేశించి నరేందర్ అనుచరులు చాలా అసభ్యంగా మాట్లాడారన్నారని విమర్శించారు. రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో మద్దతు ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతానన్నారు. లేదంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డానని, బంగారం తెలంగాణ సాధన కోసం అనేక త్యాగాలు చేసినట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో పనిచేసినట్టుగా ఆయన చెప్పారు. 


బీజేపీలోకి! 


వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడుగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్ఎస్ కు రాజీనామాచేశారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి ప్రదీప్ రావు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.  టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డానని ఎర్రబెల్లి అన్నారు. అన్నీ సహించి ఇన్నాళ్లూ పార్టీలో కొనసాగానని తెలిపారు. ప్రదీప్‌ రావు బీజేపీలో చేరడం ఖాయమని సమాచారం. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది.  


"నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాను. ఎమ్మెల్యే నరేందర్ అవమానపరిచేలా మాట్లాడారు. ఎమ్మెల్యే నన్ను అవమానకరంగా తిడుతున్నారు. ఆయన ఏం తిట్టినా టీఆర్ఎస్ నాయకులు దానిని ఖండించలేదు. ఏ పార్టీలో గౌరవం ఉంటే అక్కడి వెళ్తా లేదంటే ఇండిపెండెంట్ గా ఉంటాను. " -ఎర్రబెల్లి ప్రదీప్‌రావు 


Also Read : KTR-Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ పవన్ కల్యాణ్ యాక్సెప్ట్, ‘రామ్‌ భాయ్‌ - కేటీఆర్ అన్నా’ అనుకుంటూ ఆప్యాయత