కొన్ని విషయాలు చెప్పే తీరుగా ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండదు. దాంతో అధికారులు, ప్రభుత్వాలు సైతం సోషల్ మీడియాను వాడుకోవడం మొదలుపెట్టాయి. తెలంగాణలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులను ఆకర్షించేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్లకు రెస్పాన్స్ అదిరిపోతుంది. అదే విధంగా హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల గురించి వినూత్న రీతిలో పోస్టులు పెడుతూ వాహనదారుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 


ఆ చలికి మీరు తట్టుకోలేరు.. 
తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా పలు రాష్ట్రాల పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్ని, మద్యం తాగి వాహనం నడిపేవారిని అప్రమత్తం చేస్తున్నారు. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్ పోలీసులు పెట్టిన ఓ వార్నింగ్ బోర్డ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కులు మనాలి పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు పక్కన ఓ వార్నింగ్ బోర్డ్ ఏర్పాటు చేశారు. అందులో ‘డోంట్ డ్రైవ్ డ్రంక్.. మనాలిలో ఉండే జైళ్లు విపరీతమైనంత చల్లగా ఉంటాయి’ కులు పోలీసులు అని సైన్ బోర్డ్ పెట్టారు. స్మోకింగ్ చేస్తే, ఊపిరితిత్తులను కాల్చివేస్తాయి అని చివరి లైన్ లో మెన్షన్ చేశారు. 





సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఈ బోర్డు గమనించిన ఓ నెటిజన్ వీడియో తీసి ఆ వార్నింగ్ బోర్డు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కులు పోలీసులు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మద్యం తాగి వాహనాలు సేవిస్తే ఏం జరుగుతుందో సెటైరి కల్‌గా వారు ఏర్పాటు చేసిన వార్నింగ్ బోర్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 6 మిలియన్లకు పైగా నెటిజన్లు వీడియో చూశారు. దాదాపు 3.4 లక్షల మంది వీడియోను లైక్ చేశారు. 


భిన్నమైన కామెంట్స్
నెటిజన్లు ఆ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. సరైన కారణం చెప్పారు సర్ అని కొందరు కామెంట్ చేశారు. వామ్మో వాట్ యాన్ ఐడియా సర్ అని మరికొందరు స్పందించారు. కొందరు మరో అడుగు  ముందుకేసి.. సమ్మర్ టైమ్ అందుకు తగిన సమయం అని తమదైన శైలిలో వీడియో పోస్టుపై కామెంట్ చేశారు.