ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రహంపాడ్ లో కొండా మురళీధర్ రావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన స్థూపాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. నిన్న సాయంత్రం హుటాహుటిన స్థూపం దగ్గరకు వచ్చిన కొండా సురేఖ అత్తమామలకు నివాళి అర్పించారు. పడుకున్న సింహాన్ని లేపారని కొండా మురళి కూతురు సుశ్మితా పటేల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదేశంతో స్థూపాన్ని కూల్చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఇకపై కొండా ఫ్యామిలీ అంటే ఏంటో చూపిస్తామని చల్లా ధర్మారెడ్డిని హెచ్చరించారు. 


కొండా దంపతులపై ధర్మారెడ్డి ఫైర్ 


ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పందించారు. కొండా దంపతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కోపం వస్తే కొండా దంపతులు అడ్రస్స్ లేకుండా పోతారన్నారు. ప్రజలు కొండా దంపతులను ఎప్పుడో తరిమికొట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే అగ్రహంపాడ్ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల ఆగ్రహనికీ గురై కొండా దంపతులు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ అయ్యారు. 


Also Read: కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాల ధ్వంసం.. పరకాలలో తీవ్ర ఉద్రిక్తత !


అసలేం జరిగిందంటే..


ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయ‌కుడు కొండా ముర‌ళి త‌ల్లిదండ్రుల స్మార‌క నిర్మాణాన్ని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు ధ్వంసం చేయ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. హ‌న్మకొండ జిల్లా ఆత్మకూరు మండ‌లం అగ్రంప‌హాడ్ మేడారం జాత‌ర స‌మీక్ష స‌మావేశానికి శ‌నివారం ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి హాజ‌ర‌య్యారు. ర‌హ‌దారికి అడ్డంగా ఉంద‌ని ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఆదేశాల‌తో కొండా ముర‌ళి త‌ల్లిదండ్రులైన కొండా చెన్నమ్మ, కొముర‌య్యల జ్ఞాప‌కార్థం నిర్మించిన గ‌ద్దెల‌ను కూల్చివేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే అవి ప్రైవేటు స్థలంలో ఉన్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే చెప్పారని టీఆర్ఎస్ నాయ‌కులు కొంత‌మంది కొండా ముర‌ళి త‌ల్లిదండ్రుల స్మార‌క నిర్మాణాన్ని కూల్చివేశారు. కొండా సురేఖ 2010 ప‌ర‌కాల ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో సొంత నిధుల‌తో ఈ నిర్మాణం చేశారు. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


కొండ సురేఖ ఆగ్రహం


ఈ ఘటనపై  కొండా సురేఖ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి  అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఏం చేయలేరని ఆమె హెచ్చరించారు. శిశుపాలుడిలా పాపాలు చేసుకుంటూ పోతున్నారని...  నీ పాపాలు పండేరోజు దగ్గర పడిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పరకాల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 


Also Read: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం