TSRTC Offers on August 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు TSRTC ఆఫర్లు ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలో ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలు తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు  టికెట్ లో 50 శాతం రాయితీ కల్పించారు. హైదరాబాద్ లో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి (Unlimited Journey In Hyderabad) సంబంధించిన టి-24 టికెట్ ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 


హైదరాబాద్ లో పిల్లలకు టి-24 టికెట్ ను రూ.50కే ఇవ్వనున్నారు. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రమే ఒక్క రోజు ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 ధర ఉంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  టి-24 టికెట్ ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50 కి ఇస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటీజన్లకు ఒక్క రోజు టికెట్ లో 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తోంది. 


"ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఆ శుభ దినాన ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష సీనియర్ సిటీజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. వారు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్ కి తమ ఆధార్ కార్డును చూపించాలి. అలాగే, స్వాతంత్ర్య దినోత్సవం నాడు హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 


ఆ రోజున పర్యాటక ప్రాంతాలు, పార్కులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టి-24 టికెట్ పై భారీ రాయితీని సంస్థ ప్రకటించింది. ఆ టికెట్ ను పెద్దలకు రూ.75కి, పిల్లలకు రూ.50కి అందజేస్తోంది. ఈ నెల 15న ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయి. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ,  ఐపీఎస్ వీసీ సజ్జనర్ అన్నారు.  స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.


ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్ 'గమ్యం' యాప్ ను తీసుకువచ్చింది. ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు అత్యాధునిక ఫీచర్లతో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ యాప్ ను హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు.