హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. జీహెచ్​ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.


వినాయక నిమజ్జనం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్, గ్రేటర్‌లోని ఇతర జలశయాల్లోనూ నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని పలు కాలనీల్లోని మండపాల్లో సుమారు లక్షకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందులో 90 శాతం పీఓపీ విగ్రహాలే పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 


అలాగైతే నిమజ్జనానికి 6 రోజుల సమయం


ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలను అనుమతించక పోతే.. మొత్తం విగ్రహాలు పూర్తి కావడానికి 6 రోజుల సమయం పడుతుందని జీహెచ్‌ఎంసీ హైకోర్టుకు తెలిపింది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కూడా కొంత సమయం అవసరమని వివరించింది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని విన్నవించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది. ఇందు కోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపింది.  ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది. నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలన్న విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించింది.





 

హైకోర్టు తీర్పు ప్రకారం ఈ 90 శాతం విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు.. ఇతర జలశయాల్లో నిమజ్జనం చేసేందుకు అనుమతి లేదు. ఈ అంశంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా.. హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 




 


నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది. అయితే కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో కష్టమవనుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లోనే విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.


Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?


Also Read: Petrol-Diesel Price, 14 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఇంధన ధరలు