రాజకీయ నేతల భాష చూస్తుంటే బాధ కలుగుతోందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. రాజకీయ నేతలు వాడుతున్న భాష ద్వారా రాష్ట్ర యువతకు, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి భాష చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ రావిర్యాలలో నిర్వహించిన దళిత గిరిజనుల దండోరా యాత్ర మహాసభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై టీఆర్ఎస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పీయూసీ చైర్మన్ ఏ.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.


దళిత బంధును చూసి ఎందుకు బీజేపీ, కాంగ్రెస్ భయపడుతోందని గువ్వల బాలరాజు ప్రశ్నించారు. ఇన్ని ఏళ్లలో దళితుల అభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా ఇలాంటి ఆలోచన చేసిందా అని నిలదీశారు. అసలు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్లు తెచ్చుకొని చూపించాలని సవాలు విసిరారు. ఎదురుగా జనం సీటీలు, విజిల్స్ కొడుతున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు.


పీయూసీ ఛైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లఫంగ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు రేవంత్ నిన్నకాక మొన్న వచ్చారని, 75 ఏళ్లుగా దేశాన్ని గాంధీ కుటుంబం దోచుకుందని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వలేదనే కాంగ్రెస్ మాటను ఖండిస్తున్నట్లు చెప్పారు. వడ్డీలేని రుణాలను మహిళలకు రూ.వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. రేవంత్‌కి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉద్యోగం ఇచ్చిందే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ‘‘నిన్న సభలో రేవంత్ రెడ్డి చదువులేని సన్నాసి లాగా మాట్లాడారు. దళితులకు విద్యను దూరం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. జానారెడ్డి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్న మాటలు ప్రజలు నమ్మలేదు. తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం ఏంటో కానీ- రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం తప్పుడు ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి నెంబర్ వన్’’ అని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.  ఇలానే మాట్లాడితే కచ్చితంగా గజ్వేల్‌లో జరిగే సభను అడ్డుకుంటామని హెచ్చిరంచారు టీఆర్‌ఎస్‌ నేతలు. 


Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్


రేవంత్ వ్యాఖ్యలివీ..
‘‘ఇంద్రవెల్లిలో ఓ అడుగు వేశాం.. ఇంకో అడుగు ర్యాలీలో వేశాం.. ఇంకో అడుగు కేసీఆర్ నెత్తి మీద పెట్టి తొక్కుతాం. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని బుధవారం నాటి దళిత దండోరా సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల రోజుల నుంచి ఆగం ఆగం అవుతున్నారని అన్నారు. దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు, కాదని.. విద్య ఉపాధి కావాలని రేవంత్ అన్నారు. 10 లక్షలు దేనికి సరిపోతాయని అడిగారు.  ఇంట్లో సెలవు తీసుకుని రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. 19 నెలలు కష్టపడితే.. అధికారం మనదేనని రేవంత్ అన్నారు. ప్రణబ్​ ముఖర్జి వచ్చినప్పుడు, మాజీ గవర్నర్ నరసింహన్​ కనిపించినప్పుడు కేసీఆర్​ వాళ్ల కాళ్లు మొక్కాడని రేవంత్ రెడ్డి అన్నారు. ​దళిత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వచ్చినప్పుడు కనీసం నమస్కారం కూడా చేయలేదని పేర్కొన్నారు.


Also Read: Santosh Nagar Gang Rape: ఆ గ్యాంగ్ రేప్ ఉత్తిదే.. తేల్చేసిన పోలీసులు, ఆ యువతి మాస్టర్ ప్లాన్ ఎందుకంటే..


Also Read: Hyderabad Theft: అమ్మమ్మతో కలిసి యువకుడు దొంగతనాలు.. వీళ్లు ఆడే నాటకాలకి షాక్‌లో బాధితులు