Telangana Steel Banks: తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు పంచాయతీ రాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేస్తోంది. దీంతో ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ వస్తువులను వాడనున్నారు. సిద్దిపేట జిల్లాలోని మొత్తం పంచాయతీలు స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయి. మిగిలిన జిల్లాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అయితే పర్యావరణానికి తీవ్ర స్థాయిలో హానీ కల్గజేస్తున్న ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మన రాష్ట్రం చేపట్టన స్టీల్ బ్యాంక్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. స్టీల్ బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా.. పంచాయతీ రాజ్ కార్యాలయాన్ని నిర్వహించే సమావేశాలు, అక్కడికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది, తాగునీరు, భోజనాలు చేయడం తదితర వాటి కోసం ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్ ను వాడేలా స్టీల్ బ్యాంకును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.


స్టీలు గ్లాసులు, గిన్నెలు, ప్లేట్లు, బాటిళ్లు..


స్టీల్ గ్లాసులు, మగ్గులు, ప్లేట్లు, గిన్నెలు, స్టీల్ బాటిల్స్ కొనుగోలు చేస్తారు. వీటినే అన్ని కార్యక్రమాల్లో వినియోగిస్తారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 170 మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్‌ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. మరికొన్ని మండల్లాలోని గ్రామ పంచాయతీలు స్టీల్ వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో బ్యాంకును ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ జిల్లాలో ఉన్న 23 మండలాల్లోని 499 పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 14 మండలాలు, నిజామాబాద్ లో 11, ఆదిలాబాద్ లో 10 మండలాల్లోని పంచాయతీల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.