Harish Rao News: గజ్వేల్ లో ఐఓసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రేపు నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారని చెప్పారు. అనంతరం గజ్వేల్ లో నామినేషన్ తర్వాత హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారని చెప్పారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని హరీశ్ రావు వివరించారు.


ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎంతో గజ్వేల్ లో ఈ నెల 28న తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. ‘‘2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాం. కేసీఆర్ కు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం అయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్.


విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ కి రాబోతుంది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు.


కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీకి వచ్చినా అది నామ మాత్రమే. కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు.


మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి.


తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు? పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బీఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది’’ అని హరీశ్ రావు మాట్లాడారు.