Telangana Minister Ponguleti Srinivas Reddy | హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణపై సైతం ప్రభావం పడింది. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల అధికారులు, సిబ్బంది పునరావాస చర్యల్లో నిమగ్నం కావాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి ఉధృతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.


భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం, ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో గోదావరి ఉధృతి పెరిగింది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెస్కూటీమ్‌లను వినియోగించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.


కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు 
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి జిల్లాల కలెక్టర్లు జాగ్రత చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రధాన వాగుల వద్ద, రోడ్లపై నీరు ప్రవహించే సమీప కాలువల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, వర్షాలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా హైదరాబాద్ లో ఉన్నతాధికారులను, తనను సంప్రదించవచ్చునని మంత్రి పొంగులేటి చెప్పారు.